Hight Court – Vishnupriya: హైదరాబాద్ బెట్టింగ్ యాప్స్ కేసులకు సంబంధించి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ యాంకర్ విష్ణుప్రియకు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న విష్ణుప్రియ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా పోలీసుల విచారణకు సహకరించాలని విష్ణుప్రియకు తేల్చి చెప్పింది.
విష్ణుప్రియపై కేసు నమోదు
కాసుల కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న పలువురు యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్లు, నటీ నటులపై ఇటీవల హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ యాంకర్ విష్ణుప్రియపై సైతం మియపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఆమె పోలీసుల విచారణకు సైతం హాజరైంది. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఇటీవల హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. విష్ణుప్రియ పిటిషన్ ను తిరస్కరించింది.
25 మంది సెలబ్రిటీలపై కేసు
బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి మియాపుర్ పోలీసు స్టేషన్ పరిధిలో దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రానా దగ్గుబాటి (Rana Daggubati), ప్రకాష్ రాజ్ (Prakash Raj) వంటి ప్రముఖులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా సెలబ్రిటీలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వారి స్టేట్ మెంట్స్ ను సైతం పోలీసులు రికార్డు చేశారు. పలువురు ప్రముఖులు తమ ప్రమేయం లేకుండానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశామని.. వాటి తాలుకూ పర్యవసానాలు గ్రహించలేదని సెలబ్రిటీలు వాపోయినట్లు సమాచారం.
ఓనర్లపై కేసు నమోదు
డబ్బు ఆశ చూపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బెట్టింగ్ యాప్ ఓనర్ల (Betting App Owners)పై సైతం పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. యూట్యూబ్ ఇన్ ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలపై కేసులు నమోదు చేస్తూ వచ్చిన పోలీసులు.. వాటి యజమానులపై ఫోకస్ పెట్టారు. రీసెంట్ గా 19 మంది బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకొని వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేసే అవకాశముంది.
Also Read: CM Revanth – Delimitation: సౌత్ చూపంతా తెలంగాణ వైపే.. సీఎం రేవంత్ వాట్ నెక్ట్స్?
సిట్ పరిధిలోకి కేసులు!
బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వాటిపై వివిధ స్టేషన్లలో నమోదైన కేసులన్నీ సిట్ పరిధిలోకి రానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పంజాగుట్ట, మియాపూర్ పీఎస్ లలో వేర్వేరుగా రెండు కేసులు నమోదుకాగా వాటిని సిట్ కు బదిలి చేయనున్నారు. కాగా సిట్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే మరోమారు సెలబ్రిటీలు సిట్ విచారణ హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్స్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 900 మంది సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.