Crime News: తనను ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో పని చేసిన సంస్థలోనే దొంగతనం చేశాడు ఆ ఘనుడు. పైకప్పులో ఉన్న చిన్న సందు ద్వారా లోపలికి ప్రవేశించి లాకర్ ను పగులగొట్టి 46లక్షల రూపాయల నగదును తస్కరించి ఉడాయించాడు. ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన బేగంపేట పోలీసులు(Begumpet Police )ఆరు గంటల్లో నిందితున్ని పట్టుకున్నారు. అతని నుంచి మొత్తం నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాల్(DCP Rashmi Perumal) తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ అశోక్, బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణ మూర్తితో కలిసి వివరాలు వెల్లడించారు.
మద్యానికి బానిసైన గిరిధారి సింగ్….
మధ్యప్రదేశ్(Madhyapradesh) రాష్ట్రానికి చెందిన గిరిధారి సింగ్ (28) పాటిగడ్డలోని సన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్(Sun Steels P.V.T) లో మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. అయితే, మద్యానికి బానిసైన గిరిధారి సింగ్ డ్యూటీ సరిగ్గా చేయక పోతుండటంతో సంస్థ యాజమాన్యం అతన్ని కొన్నిరోజుల నుంచి ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా, పని చేసిన సమయంలో ఆఫీస్ గోడౌన్ లోని లాకర్ లో భారీ మొత్తాల్లో నగదును భద్రపరిచే విషయం తెలిసి గిరిధారి సింగ్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 20న పైకప్పుకు ఉన్న చిన్న సందు నుంచి లాకర్ ఉన్న గదిలోకి ప్రవేశించాడు. అనంతరం లాకర్ ను పగులగొట్టి అందులో ఉన్న 46లక్షల రూపాయల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ మేరకు సన్ స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిర్యాదు చేయగా బేగంపేట సీఐ బీ.ప్రసాదరావు కేసులు నమోదు చేశారు. డీఐ జీ.శ్రీనివాస్, ఎస్సై టీ.శ్రీధర్ తోపాటు సిబ్బందితో కలిసి గిరిధారి సింగ్ కోసం గాలింపు చేపట్టారు. పదుల సంఖ్యలో సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషించారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు.. బండి సంజయ్ సంచలన రియాక్షన్!
మహారాష్ట్ర సరిహద్దుల వద్ద బస్సు ఆపి….
ఈ క్రమంలో మేడ్చల్*(Medchal) లోని ఓ దాబా యజమాని మొబైల్ నుంచి గిరిధారి సింగ్ తన స్వస్థలానికి ఫోన్ చేసినట్టుగా వెల్లడైంది. బస్సులో సొంతూరికి వెళుతున్నట్టుగా తెలిసింది. దాంతో బస్సు డ్రైవర్ ను కాంటాక్ట్ లోకి తీసుకున్న దర్యాప్తు బృందం గిరిధారి సింగ్ పై కన్నేసి పెట్టింది. దాంతోపాటు బస్సు వెళుతున్న దారిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారాన్ని అందించింది. గిరిధారి సింగ్ ఫోటోలను పంపించి కనిపించిన వెంటనే అదుపులోకి తీసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో మహారాష్ట్ర సరిహద్దుల వద్ద బస్సును ఆపిన ఆదిలాబాద్(Adhilabadh Police) పోలీసులు గిరిధారి సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అక్కడకు వెళ్లిన బేగంపేట పోలీసులు అతన్ని తమ కస్టడీకి తీసుకున్నారు. నిందితుని నుంచి 46లక్షలు స్వాధీనం చేసుకుని హైదరాబాద్ (Hyderarabad)తీసుకొచ్చారు. చాకచక్యంగా దర్యాప్తు జరిపి కేవలం ఆరు గంటల్లోనే నిందితున్ని పట్టుకుని చోరీ చేసిన మొత్తం డబ్బును రికవరీ చేసిన దర్యాప్తు బృందాన్ని డీసీపీ రష్మీ పెరుమాళ్ అభినందించారు.