Investment Fraud: గోవాకు చెందిన నిందితుడి అరెస్ట్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కళ్లు చెదిరే లాభాలు వస్తాయంటూ జనాన్ని ఏకంగా 6 కోట్ల రూపాయలకు ముంచిన (Investment Fraud) నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. డీసీపీ ముత్యం రెడ్డి తెలిపిన ప్రకారం, నార్త్ గోవాకు చెందిన సైరస్ హోర్మూస్, అతడి స్నేహితుడు నిఖిల్ కుమార్ గోయల్ ఇద్దరూ కలిసి ‘ఫిబ్ వేవ్ అనలటిక్స్ ఎల్ఎల్పీ’ పేరిట ఒక సంస్థను ప్రారంభించారు. ఆ తరువాత తమ సంస్థలో డిపాజిట్లు చేస్తే ఏటా 30 నుంచి 48 శాతం లాభాలు పంచి ఇస్తామంటూ ఇద్దరూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. మొదట్లో డిపాజిట్లు చేసిన కొందరికి చెల్లింపులు కూడా చేశారు. దాంతో పెద్ద పెద్ద సంఖ్యలో జనం ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టారు. అయితే, 2018 వరకు లాభాలు ఇస్తూ వచ్చిన నిందితులు ఆ తరువాత దివాళా తీశారు. ఈ మేరకు కొందరు బాధితులు ఫిర్యాదు చేయగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏసీపీ సోమ నారాయణ సింగ్ విచారణ చేపట్టి సైరస్ను గోవాలో అరెస్ట్ చేశారు.
Read Also- Maruthi responds: వారికి ‘ది రాజాసాబ్’ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్.. ఫ్యాన్స్ నుంచి అది చాలు..
ముగ్గురు దొంగలు అరెస్ట్
30లక్షలకు పైగా విలువ చేసే సొత్తు సీజ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: వేర్వేరు కేసుల్లో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన కూకట్పల్లి పోలీసులు వారి నుంచి 30 లక్షలకు రూపాయలకు పైగా విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఏటీసీ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా పని చేస్తుండటం గమనార్హం. బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో కలిసి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కూకట్ పల్లి బాలాజీనగర్ నివాసి ఆర్యన్ యోగేశ్ స్కూల్లో ఉన్నపుడే చదువు మానేశాడు. ఆ తరువాత ఆవారాగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదించటానికి తాను ఉంటున్న ప్రాంతంలోనే తెరిచి ఉన్న ఇళ్లల్లో చోరీలు చేస్తూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక, జగద్గిరిగుట్ట నివాసి మస్సి సురేశ్ గచ్చిబౌలిలోని ఏటీసీ కంపెనీలో నెట్ వర్క్ ఇన్ ఛార్జ్గా పనిచేస్తున్నాడు. దుర్వ్యసనాలకు అలవాటు పడి డబ్బు కోసం కారును అపహరించి దొరికిపోయాడు. మూసాపేట ఇందిరమ్మ కాలనీ నివాసి అల్లూరి పవన్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. జల్సాలు చేసుకోవటానికి తాను పని చేస్తున్న స్టూడియోలోనే దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ముగ్గురిని అరెస్ట్ చేసిన సీఐ సుబ్బారావు, డీఐ కొండలరావు, క్రైం ఎస్ఐ రవీందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ నాగరాజులను డీసీపీ అభినందించారు.
Read Also- Maa Mundeshwari Temple: దేశంలోనే వింతైన ఆలయం.. మేకను బలిస్తారు కానీ.. ఒక్క చుక్క రక్తం కారదు!