New Cyber Scam: ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు రూట్ మారుస్తూ జనం నుంచి డబ్బు కొల్లగొడుతూనే ఉన్నారు. ఇటీవలిగా ప్రభుత్వ బెనిఫిట్లు, బ్యాంక్ సేవలు, భారీ లాభాలు సంపాదించి పెట్టే పెట్టుబడుల అవకాశాలు అంటూ ఏపీకే ఫైళ్లను మొబైల్ ఫోన్లకు పంపిస్తున్నారు. అదేందో చూద్దామని ఫైల్ ను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోగానే అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాలను ఊడ్చేస్తున్నారు. ఈ తరహా నేరాలు కొన్నిరోజులుగా ఎక్కువగా జరుగుతుండటంతో హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP Dara Kavitha) బహుపరాక్ అని హెచ్చరిస్తున్నారు.
సేకరించిన డేటాతో..
ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పని చేసే బ్రోకర్లు, ఆధార్ సెంటర్ల నుంచి ప్రజలకు సంబంధించిన డిజిటల్ పర్సనల్ డేటాను సైబర్ క్రిమినల్స్ సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఆయా సంస్థల్లో పని చేస్తున్న వారిలో కొందరికి డబ్బు ఆశ చూపించి సెల్ ఫోన్(Cell Phone), ఆధార్ కార్డ్(Aadhar card) నెంబర్లతోపాటు పూర్తి సమాచారాన్ని కొనుక్కుంటున్నారు. ఆ తరువాత మోసాలకు తెర లేపుతున్నారు. రాండంగా ఒకేసారి వేల సంఖ్యలో మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్(SMS), వాట్సాప్(WhatsApp), ఈమెయిల్ తోపాటు సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా లింకులు పంపిస్తున్నారు. ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందటం ఎలా?, బ్యాంక్ అప్ డేట్లు, ఉద్యోగ అవకాశాల పేర ఏపీకే ఫైళ్లను పంపిస్తూ వాటిని డౌన్ లోడ్ చేసుకొమ్మని సూచిస్తున్నారు.
అయితే, గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) నుంచి కాకుండా బయటి నుంచే ఈ ఫైళ్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మేలు జరుగుతుందేమో అని ఆశపడి ఎవరైనా ఈ ఫైళ్లను డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోగానే అవతలి వ్యక్తికి సంబంధించిన మొబైల్ ఫోన్ ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. దీని కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న టూల్స్ ను ఉపయోగించుకుంటున్నారు. ఒక్కసారి సెల్ ఫోన్ తమ కంట్రోల్ లోకి రాగానే అవతలి వ్యక్తి బ్యాంక్ ఖాతాలు, ఓటీపీ(OTP) నెంబర్లు, వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఆ తరువాత ఉచ్ఛులో పడ్డ వారి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే మొబైల్ ఫోన్ల నుంచి ఇలా సేకరించిన ఫోన్ నెంబర్లు, డేటా ఆధారంగా సైబర్ క్రిమినల్స్ మరింత మందిని మోసాలు చేస్తుండటం.
Also Read: Swetcha Effect: విధులకు డుమ్మా వేతనం పక్క..స్వేచ్ఛ కథనంపై స్పందించిన ఉన్నతాధికారులు
జాగ్రత్తగా ఉండాలి..
ఈ తరహా మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సైబర్ క్రైం డీసీపీ దార కవిత(DCP Kavitha) తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, టెలిగ్రాం, ఈ మెయిల్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల నుంచి వచ్చే యాప్ లు, ఫైళ్లను ఇన్ స్టాల్ చేసుకోవద్దని చెప్పారు. బ్యాంక్ అప్ డేట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, కేవైసీ వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఏ లింకును కూడా క్లిక్ చేయవద్దని తెలిపారు. అనవసర అనుమతులను అడిగే యాప్ ల జోలికి వెళ్లనే వెళ్ల వద్దని చెప్పారు. ఎప్పటికప్పుడు మొబైల్ తోపాటు యాంటీ వైరస్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు.
ప్రమాదకరమైన మాల్వేర్ల నుంచి రక్షణ పొందటానికి మొబైల్ ఓఎస్, సెక్యూరిటీ టూల్స్ ను అప్ డేట్ చేసుకుంటుండాలని చెప్పారు. ఏ బ్యాంకుగానీ, ప్రభుత్వ సంస్థలుగానీ ఓటీపీ నెంబర్లు, అకౌంట్ల వివరాలు అడగవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎవ్వరు అడిగినా ఈ వివరాలను తెలియ చేయవద్దని చెప్పారు. మోసానికి గురైతే మొదటి గంటలోనే 1930 నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్నారు. cybercrime.gov.in అడ్రస్ కు మెయిల్ కూడా చేయవచ్చన్నారు. మొదటి గంటలో ఫిర్యాదు చేసినపుడే బాధితులు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
