Air India Crew: ఇటీవల ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి (Air India Plane Crash) గురైన విషయం తెలిసిందే. ఈ విషాదంలో ప్యాసింజర్లతో పాటు ఏకంగా 8,200 గంటలపాటు విమానాన్ని నడిపిన సుధీర్ఘ అనుభవం ఉన్న కెప్టెన్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్, మరో 10 మంది సిబ్బంది కన్నుమూయడంపై సర్వత్రా విచారం వ్యక్తమైంది. అయితే, ఈ విషాద సమయంలో ఎయిరిండియా విమాన సిబ్బంది ఒకరు కక్కుర్తి పనికి పాల్పడ్డట్టు బయటపడింది. అమెరికా నుంచి రూ.1.41 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. నిర్దిష్ట నిఘా సమాచారం ఉండడంతో ముంబై ఎయిర్పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. జూన్ 13న న్యూయార్క్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ-116కు చెందిన సిబ్బందిలోని ఒక మగ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ నెట్వర్క్కు సంబంధించిన నిఘా సమాచారం ఉండడంతో రంగంలోకి దిగామని అధికారులు వివరించారు.
Read this- AirIndia Crash: ఎయిరిండియా క్రాష్పై తుర్కియే కీలక ప్రకటన
ప్రాథమిక పరిశీలనలో నిందిత వ్యక్తి వద్ద బంగారం లభించలేదని, తదుపరి దర్యాప్తులో బయటపడిందని వెల్లడించారు. డ్యూటీ ముగిసిన తర్వాత నిందిత వ్యక్తికి బ్రీత్ఎనలైజర్ పరీక్ష చేశామని, ఆ సమయంలో బ్యాగేజ్ సర్వీసెస్ ఏరియా సమీపంలో బ్లాక్ డక్ట్ టేప్లో చుట్టి ఉంచిన విదేశీ బంగారు కడ్డీలు బటయపడ్డాయని వెల్లడించారు. ఒక పర్సులో దాచిపెట్టాడని అధికారులు చెప్పారు. బంగారం బరువు 1,373 గ్రాములు ఉందని వెల్లడించారు. గతంలో కూడా చాలాసార్లు బంగారం స్మగ్లింగ్ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడని వివరించారు. దర్యాప్తు అనంతరం ఈ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నామని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఎయిర్లైన్ సిబ్బందిని నియమిస్తున్న హ్యాండ్లర్ను కూడా అదుపులోకి తీసుకున్నామని, నిందితుడు ఇప్పటికే పలు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహించినట్లు ఒప్పుకున్నాడని వివరించారు.
Read this- Kedarnath Helicopter Crash: గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు.. రెండు నెలల గ్యాప్లో…
బంగారం విలువ రూ.1.41 కోట్లు
ఎయిరిండియాకు చెందిన నిందిత వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారుగా రూ.1.41 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు లెక్కగట్టారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం, బంగారాన్ని జప్తు చేశామని, స్మగ్లింగ్కు పాల్పడిన నిందిత వ్యక్తితో పాటు సూత్రధారిని రిమాండ్కు తరలించినట్టు వివరించారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. బంగారం స్మగ్లింగ్ నెట్వర్క్లే లక్ష్యంగా డీఆర్ఐ ఎప్పుడూ కన్నేసి ఉంచుతుంది. ఎయిర్పోర్టుల ద్వారా బంగారం స్మగ్లింగ్కు పాల్పడిన విమాన, గ్రౌండ్ సిబ్బందిని ఇప్పటికే పలువురిని గుర్తించి అరెస్ట్ చేసింది. పలువురు కేసులు ఎదుర్కొంటున్నారు. 2024 డిసెంబర్లో కూడా ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది. చెన్నై విమానాశ్రయంలో 1.7 కేజీల 24 క్యారెట్ల బంగారం స్మగ్లింగ్ చేయడంలో ఓ ప్యాసింజర్కు ఎయిరిండియా క్యాబిన్ సిబ్బంది ఒకరు సాయం చేశాడు. విమానంలో ప్రయాణికుడి బంగారం బయటపడకుండా సాయపడ్డాడు. అధికారులు గుర్తించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇక, 2024 మే నెలలో, సురభి ఖాతున్ అనే ఎయిరిండియా ఎయిర్హోస్టెస్, కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్కు పాల్పడి పట్టుబడింది. తన పురీషనాళంలో 960 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టి అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి.