New Rules: బ్యాంకింగ్ వంటి ఆర్థిక సేవలు, ఆధార్, పాన్, ట్రైన్ టికెట్ బుకింగ్ వంటి ముఖ్యమైన సేవలకు సంబంధించిన నియమ నిబంధనలు పర్మినెంట్ కాదు. కాలానుగుణంగా, అవసరాలు, పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులకు గురవుతుంటాయి. మేనేజ్మెంట్లు, వినియోగదారుల సౌలభ్యం కోసం నెల ప్రారంభంలో ఈ తరహా కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకురావడం సర్వసాధారణం. 2025 జులై 1 (మంగళవారం) నుంచి కూడా కొన్ని మార్పులు ఆచరణలోకి రాబోతున్నాయి. బ్యాంకింగ్ సేవలు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్, క్రెడిట్ కార్డులు, తత్కాల్, ట్రైన్ టికెట్ బుకింగ్తో పాటు పాన్ అప్లికేషన్లకు సంబంధించిన పలు రూల్స్ మారబోతున్నాయి. చాలామందిని ప్రభావితం చేయబోయే ఈ రూల్స్ ఏమిటో మీరూ తెలుసుకోండి.
కొత్త పాన్కి ఆధార్ తప్పనిసరి
ఇకపై కొత్త పాన్ కార్డు కావాలంటే దరఖాస్తుకు ఆధార్ కార్డు జిరాక్స్ను జతపరచడం తప్పనిసరి. ఈ నిబంధనను మంగళవారం నుంచి అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతానికి కొత్త పాన్ కార్డ్ దరఖాస్తులకు డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్ వంటి ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ను జత చేస్తే సరిపోయేది. ఇప్పటికే పాన్ కార్డు పొందినవారు ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు ఆధార్తో అనుసంధానించుకోవాలి. అయితే, ఆధార్తో లింక్ చేసుకోకపోతే మాత్రం పాన్ కార్డు ఇన్వ్యాలిడ్గా మారుతుంది.
Read this- Techie self Lock: తాళం వేసుకొని ఫ్లాట్లో మూడేళ్లు.. గుండె తరుక్కుపోయే కన్నీటి కథ
తత్కాల్కు ఆధార్ తప్పనిసరి
రైలు ప్రయాణీకులు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలంటే ఇకపై ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. జులై 15 నుంచి అన్ని రకాల రైలు టికెట్ల బుకింగ్కు 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ అమల్లోకి వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్కు వచ్చే వన్-టైమ్ పాస్వర్డ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైలు టికెట్ రేట్లలో కూడా స్వల్ప పెరుగుదల ఉండే సూచనలు ఉన్నాయి. నాన్-ఏసీ కోచ్లకు కిలో మీటర్కు 1 పైసా, ఏసీ కోచ్లకు రెండు పైసల వరకు పెరగవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
ఐటీఆర్ దాఖలు గడువు పెంపు
ఐటీఆర్ లేదా ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు గడువును సీబీడీటీ పెంచింది. వాస్తవ డెడ్లైన్ జూలై 31గా ఉండగా, సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దీంతో, ఫైలింగ్ చేయాల్సినవారికి మరో 46 రోజుల సమయం దక్కింది. అయితే, ఇప్పటికే డాక్యుమెంటేషన్ పూర్తిచేసినవారు పాత గడువులోగానే ఫైలింగ్ పూర్తి చేయాలి. తద్వారా, గడువు దగ్గరపడే సమయంలో వెబ్సైట్ నుంచి ఎదురయ్యే అవాంతరాలు, లోపాలను అధిగమించవచ్చునని సీబీడీటీ భావిస్తోంది.
Read this-Facebook: గుట్టుచప్పుడుకాకుండా ఫేస్బుక్ కొత్త టెస్టింగ్
క్రెడిట్ కార్డ్ మార్పులు ఇవే
ఎస్బీఐ ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ వంటి ఎంపిక చేసిన ప్రీమియం కార్డులపై కొనుగోలు చేసే విమాన టిక్కెట్లపై అందించే విమాన ప్రమాద బీమాను ఎస్బీఐ నిలిపివేస్తోంది. జులై 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తోంది. ప్రతినెలా బకాయి చెల్లించే విధంగా ఎంతోకొంత కనీస బకాయి విధానాన్ని కూడా ప్రవేశపెట్టవచ్చనే అంచనాలున్నాయి. మరోవైపు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు ఎంపిక చేసిన లావాదేవీలపై ఛార్జీలను సవరించాయి. కార్డు వినియోగంపై ఒక శాతం లావాదేవీ ఛార్జీ పరిమితిని రూ.4,900లకు హెచ్డీఎఫ్సీ పరిమితం చేసింది. ఇంటి అద్దె లేదా ఖర్చుల కోసం రూ.10 వేల కంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు ఈ ఛార్జీ వర్తిస్తుంది. నెలవారీ యుటిలిటీ చెల్లింపులు రూ.50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ చార్జీలు పడతాయి. ఇన్సూరెన్సులకు సంబంధించిన లావాదేవీలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
ఇక, ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం ట్రాన్సాక్షన్తో పాటు పలు ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలలో ఇకపై మొదటి ఐదు లావాదేవీలు ఉచితంగానే లభిస్తాయి. ఆ తర్వాత నగదు ఉపసంహరణపై ప్రతి లావాదేవీకి రూ.23 ఛార్జి పడుతుంది. డబ్బు ఉపసంహరణ కాకుండా మిగతా సేవలను ఉచితంగానే పొందవచ్చు. అంతేకాదు, ఆన్లైన్ ట్రాన్ఫర్లకు సంబంధించి, ఐఎంపీఎస్ ఛార్జీలు గణనీయంగా సవరించింది. ఈ ఛార్జిని రూ.2.50 నుంచి రూ.15లకు పెంచింది.