Nandigam Suresh: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ మరోసారి అరెస్ట్ (Arrest) అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నందిగం సురేశ్ దాడికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రాజుపై నందిగం సురేశ్తో పాటు ఆయన సోదరుడు ప్రభు దాసు, బంధువులు దాడికి తెగబడ్డారు. తీవ్రగాయాలపాలైన రాజు మంగళగిరి ఎయిమ్స్ (AIMS) చికిత్స తీసుకుంటున్నాడు. ఈ దాడిపై రాజు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి అనే మహిళ ఫిర్యాదుతో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్దండరాయునిపాలెం వెళ్లి సురేష్ను అదుపులోనికి తీసుకున్నారు. అయితే ఇరువర్గాల దాడుల్లో రాజుకు గాయాలు అయినట్లుగా తెలుస్తున్నది.
Read Also- Gulzar House Fire Accident: ‘స్వేచ్ఛ’ ఎక్స్క్లూజివ్.. గుల్జార్ హౌస్లో ఇంత ఘోరం ఎలా జరిగింది?
ఏం జరిగింది?
శనివారం రాత్రి ఉద్దండరాయునిపాలెంలోకి ఓ కారు అతివేగంగా దూసుకొచ్చింది. ఎందుకిలా చేస్తున్నావ్ అంటూ కారు డ్రైవర్ను రాజు అనే వ్యక్తి మందలించాడు. దీంతో ‘మా మనుషులనే మందలిస్తావా? ఎంత ధైర్యం నీకు’ అంటూ మాజీ ఎంపీ సురేష్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఘటన జరిగిన కాసేపటికే సురేష్ తన అనుచరులతో అక్కడ వాలిపోయారు. రాజుపై దాడి చేసి, తన ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు మాజీ ఎంపీ. అనంతరం మరోసారి సురేష్, అతడి అన్న ప్రభుదాసు, బంధువులు రాజుపై దాడికి దిగారు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత రాజును వదిలేశారు. రక్తపు గాయాలతో పడివున్న రాజును కుటుంబ సభ్యులు మంగళగిరి ఎయిమ్స్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మాజీ ఎంపీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సురేష్ సోదరుడు ప్రభుదాసు, దాడి చేసిన సురేష్ బంధువుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కాగా, రాజు.. టీడీపీ నేత కావడంతో టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితులు నెలకొన్నాయి.
Read Also- YSRCP: ఆ ఒక్క పని చేసుంటే వైసీపీ గెలిచేదా..? ఘోర తప్పిదానికి కారణమెవరు?
అవసరమా సారూ..!
కాగా, అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేష్ సుమారు మూడు నెలలపాటు జైలులో ఉండి, బెయిల్ పైన బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కేసు నమోదు కావడం, అరెస్ట్ కూడా జరిగిపోయింది. ఈసారి ఎన్నిరోజులు జైల్లో ఉంటారో? అసలే పరిస్థితులు సర్లేనప్పుడు ఈ గొడవలు, హడావుడి అవసరమా? అంటూ వైసీపీ కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. వైసీపీ నేతల విషయంలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా సరే నిమిషాల్లో ఫిర్యాదులు, కేసులు, అరెస్టులు జరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏ పనిచేసినా ఆచితూచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడూ ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించడం ఏమిటి? అని వైసీపీ నేతలు సైతం నందిగంపై ఒకింత మండిపడుతున్నారు. సురేష్ పరిస్థితి ఇప్పుడేంటి? బెయిల్ వస్తుందా? లేదా? అనే దానిపై కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.