YSRCP: ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా? ఇప్పుడు సరిగ్గా ఇదే పనిలో వైసీపీ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లతో కలలో కూడా ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లి బొక్కా బోర్లా పడింది. 175 సంగతి దేవుడెరుగు కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కావడం గమనార్హం. అయితే నవరత్నాలు అమలు చేయడం, కరోనా లాంటి క్లిష్టమైన పరిస్థితిని కూడా కంట్రోల్ చేయడం, చెప్పినవి.. చెప్పనవి సైతం అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎందుకు ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు? ఈ ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఎందుకు ఓడించారు? అసలు ఏ విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు? ఈ ఘోర తప్పిదానికి కారణమెవరు? అని తెలుసుకునే పనిలో వైసీపీ అండ్ కో నిమగ్నమయ్యారు. అయితే ఈ పరిస్థితుల్లో వైసీపీలో ఓ వెలుగు వెలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పెదవి విప్పి.. ఓటమికి కారణాలు, మనసులోని మాటలు బయటపెడుతున్నారు. దీంతో వైసీపీ మాజీలకు ఏమైంది? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారేం? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి.
Read Also-Vallabhaneni Vamsi: వంశీకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు!

సీపీఎస్ రద్దు చేస్తామని వైసీపీ హామీ ఇచ్చిన అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ నెరవేరలేదు. దీంతో అధికారం పోయిన తర్వాత ఈ విషయం గుర్తు తెచ్చుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) చేసేదేమీ లేక.. ‘ మాట నిలబెట్టుకోలేకపోయాం క్షమించండి’ అని కోరారు. అయితే వైసీపీ.. ఈవీఎంల వల్లనో ఇంకే కారణం వల్లనో అధికారం కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్డీఏ కూటమి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ పెద్దలు కూడా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కదా? ఏడాది పూర్తి కావొస్తున్నా ఇంతవరకూ స్పందించట్లేదేం..? కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కనీసం కసరత్తు అయినా చేశారా’ బొత్స ప్రశ్నించారు. దీంతో అబ్బో.. ఓడిపోతే కానీ, ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదా? అంటూ సెటైర్లు వస్తున్నాయి.
మధ్యలో సంగతేంటి?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎక్కువగా వాడే డైలాగ్ గుర్తుంది కదా? అదేనబ్బా.. ‘ మనం మంచి చేశాం.. పైన దేవుడు ఉన్నాడు.. కింద ప్రజలున్నారు’ అని జగన్ చెబుతుంటారు కదా. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. మధ్యలో మోసకారి చంద్రబాబు ఉన్నాడనే విషయం అధినేత తెలుసుకోలేకపోయారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (Rachamallu Siva Prasad Reddy) ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మంచితనం కారణంగానే అధికారాన్ని కోల్పోయామని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు కుయుక్తులను అర్థం చేసుకోవడంలో జగన్ వైఫల్యం అయ్యారని.. అందుకే వైసీపీ సంకనాకిపోయిందని రాచమల్లు చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి కూడా పవర్ కోసం.. డబ్బు కోసం ప్రాకులాడి ఉండి ఉంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి తప్పకుండా వచ్చేదన్నారు. గతంలో కూడా రాచమల్లు.. వలంటీర్లు వల్లనే వైసీపీ ఓడిపోయిందని చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
Read Also- YS Jagan: ఏ క్షణమైనా వైఎస్ జగన్ అరెస్ట్.. వైసీపీలో నరాలు తెగే టెన్షన్!
ఇదే పెద్ద తప్పా?
ఒక్కొక్కరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ ఉంటే తానెందుకు స్పందించకూడదు? అని అనుకున్నారేమో కానీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy) కూడా స్పందించారు. ‘ 2024 ఎన్నికల్లో మేం తప్పుచేశాం. బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఉండుంటే బాగుండేది. పార్లమెంటులో ఎన్డీఏ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతిచ్చాం. గత ఐదేళ్లలో ప్రధాని మోదీ ఏం చెబితే అది చేశాం. చివరకు బీజేపీకి దూరమయ్యాం.. నష్టపోయాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందాం. ఇది నా అభిప్రాయం మాత్రమే.. తుదినిర్ణయం మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే’ అని ప్రసన్నకుమార్ రెడ్డి తన మనసులోని మాటలను బయటపెట్టేశారు. మొత్తానికి.. నల్లపురెడ్డి ఇన్నాళ్లు కడుపులో దాచుకున్న మాటలన్నీ ఒక్కొక్కటిగా కక్కేశారు. దీన్ని బట్టి చూస్తే ఒక్క బీజేపీతో పొత్తు లేకపోవడం వల్లనే వైసీపీ ఓడిపోయింది అంటే ఆ పార్టీ కార్యకర్తలు అయినా నమ్ముతారో లేదో చూడాలి. చూశారు కదా.. ఘోర పరాజయం తర్వాత మాజీల నోట ఎలాంటి మాటలు, సలహాలు, సూచనలు వస్తున్నాయో..? ఇంకా మున్ముందు కీలక నేతలు, మిగిలిన నేతల నోట ఎలాంటి మాటలు వస్తాయో.. ఎవరికి తోచినట్లుగా వాళ్లు మాట్లాడుతుంటే వైసీపీ హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
Read Also- Kandula Durgesh: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాటలో మంత్రి కందుల దుర్గేష్!