Hyderabad: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 46 ఏళ్ల మహిళతో కలిసి 23 ఏళ్ల యువకుడు పరారవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఖంగు తిన్న భర్త.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం.. మహిళ, యువకుడి మధ్య వివాహేతర సంబంధంగా మారిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బిహార్ చెందిన జంట 2004లో హైదరాబాద్ కు వచ్చారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో భర్త వంట మనిషిగా చేస్తుండగా.. భార్య పని మనిషిగా చేస్తోంది. అయితే వీరిద్దరికి 19 ఏళ్ల కుమారుడు, 16 ఏళ్ల కూతురు సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే సదరు మహిళకు బాన్సువాడకు చెందిన 23 ఏళ్ల యువకుడితో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం ఏర్పడిన వీరి స్నేహం.. కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.
భర్తకు తెలియకుండా కుర్రాడితో..
వయసుతో సంబంధం లేకుండా వారిద్దరు పలుమార్లు నగరంలో కలుసుకున్నట్లు సమాచారం. భర్తకు తెలియకుండా యువకుడ్ని ఆమె కలుస్తూ ఉండేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భార్య కనిపించకుండాపోయింది. దీంతో అనుమానం వచ్చిన భర్త.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య కనిపించడం లేదంటూ కంప్లయింట్ ఇచ్చాడు.
Also Read: V. C. Sajjanar: ‘మనుషులున్నారు కానీ.. మానవత్వం ఏది?’ అనే ప్రశ్నకు నిలువెత్తు నిదర్శనం!
సీసీ కెమెరాలో గుర్తింపు..
భర్త ఫిర్యాదులో మిస్సింగ్ కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. తమ దైన శైలిలో కేసును విచారించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 43 ఏళ్ల వివాహిత.. బైక్ పై ఓ యువకుడితో వెళ్లిపోతుండటం సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో వారిద్దరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతి త్వరలోనే వారి ఆచూకి కనిపెడతామని పోలీసులు పేర్కొన్నారు.

