Hydra: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నెంబర్ 66లో ఉన్న 6.12 ఎకరాలు సర్కారు భూమేనంటూ హైడ్రా (Hydra) సంచలన ప్రక్రటన చేసింది. జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హద్దులను చూపిన తర్వాతే అక్కడ ఫెన్సింగ్ వేసినట్లు పేర్కొంది. ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారిని మినహాయించి, మిగిలిన భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నెంబర్ 62తో పాటు 63ను చూపించి 66లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు ప్లాట్లుగా విక్రయించినట్లు స్పష్టమైన ఆధారాలున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. దివ్యా నగర్ లే ఔట్లో భాగంగానే ఇక్కడ ప్లాట్లు విక్రయించినట్లు నిర్థారించినట్లు తెలిపింది.
మొత్తం 6.12 ఎకరాల కబ్జా
సర్వే నెంబర్ 66 లోని ప్రభుత్వ భూమిని తమ విద్యా సంస్థలకు కేటాయించాలని కోరుతూ 2009లో నల్ల మల్లారెడ్డి దరఖాస్తు చేసుకున్నట్లు హైడ్రా పేర్కొంది. ఇలా 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని తన ఆధీనంలో ఉంచుకుని 3 ఎకరాల భూమిలో నల్ల మల్లారెడ్డి కుటుంబ సభ్యులు మామిడి తోట వేసినట్లు గుర్తించామని వివరించింది. ప్రైవేట్ భూమికి సంబంధించిన 62, 63 సర్వే నెంబర్లు చూపించి 66 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో దాదాపు 50 ప్లాట్లను మలిపెద్ది హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు అమాయకపు ప్రజలకు అమ్మినట్లు హైడ్రా గుర్తించింది.
3 ఎకరాల మామిడితోట ఎవరిదంటే?
మలిపెద్ది హనుమంత రెడ్డి కుటుంబ సభ్యులు ప్లాట్లుగా చేసి అమ్ముకుంటే, నల్ల మల్లారెడ్డి నేరుగా 3 ఎకరాల ప్రభుత్వ భూమిలో మామిడి తోట వేసినట్లు హైడ్రా వెల్లడించింది. ఇలా మొత్తం 6.12 ఎకరాలను కాజేసే ప్రయత్నాలను తాము అడ్డుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఆక్రమణలకు సంబంధించి 2010లో నల్ల మల్లారెడ్డికి ఘట్ కేసర్ ఎమ్మార్వో నోటీసులు కూడా జారీ చేశారని తెలిసింది. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు విక్రయించినందుకు గాను బాధితులకు ప్రత్యామ్నాయం చూపాల్సిన నల్ల మల్లారెడ్డి, హనుమంత రెడ్డి వారికి అన్యాయం జరిగిందంటూ గగ్గోలు పెట్టడం గమనార్హం. ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు గాను మేడిపల్లి పోలీస్ స్టేషన్లో హైడ్రా గత సొమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నల్ల మల్లారెడ్డి, హనుమంత రెడ్డి కుటుంబ సభ్యలుపై కేసు (94 ఆఫ్ 2026 సెక్షన్లు 318(4),329(3)బీఎన్ ఎస్,3 పీడీపీపీఏ) నమోదైంది. గతంలోనే జిల్లా సర్వే అధికారి నియమించిన సర్వే కమిటీ ప్రభుత్వ భూమిగా నిర్ధారించి సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఏడీ సర్వే బృందం వచ్చి సోమవారం హద్దులు నిర్ధారించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది.
చర్యలు తీసుకున్నా తీరు మారలేదు
చుట్టుపక్కల ఉన్న లే ఔట్లు అన్నీ కలిపి రహదారులు, పార్కుల హద్దులు పట్టించుకోకుండా దివ్యా నగర్ లే ఔట్ పేరుతో చేసిన అరాచకాలపై గతేడాది హైడ్రా చర్యలు తీసుకున్నా ఆక్రమణదారుల తీరు మారలేదు. 200 ఎకరాలకు పైగా ఉన్న దివ్యా నగర్ లే ఔట్లో అడ్డుగోడలను తొలగించిన హైడ్రా 2,218 ప్లాట్ల యజమానులకు దారి చూపింది. అక్కడ ఎవరైనా అవసరాల కోసం ప్లాట్లు అమ్మాలన్నా, కొనుగోలు చేయాలన్నా, నల్ల మల్లారెడ్డి అనుమతితోనే జరిగేలా ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. దీంతో అక్కడి ప్లాట్లకు మంచి ధర లభించింది.
హైడ్రా చర్యలను అడ్డుకునే ప్రయత్నం
దీంతో హైడ్రాకు, ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేసి ప్లాట్ల యజమానులు రిలాక్స్ అయ్యారు. అక్కడి అటవీ భూమిని ఎకరాల కొద్దీ ఆక్రమించిన విషయమై నల్ల మల్లారెడ్డిపై విచారణ కొనసాగుతున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. వీటి నుంచి బయట పడడానికి అమాయకులను ముందు పెట్టి హైడ్రా చర్యలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేసి, నష్టపోయిన వారితో గురువారం విలేఖరుల సమావేశాన్ని నిర్వహించి విషయాన్ని తప్పుదోవ పట్టించడాన్ని ఖండిస్తున్నట్లు హైడ్రా వివరించింది. నల్ల మల్లారెడ్డి చేతిలో మోసపోయిన వారిలో చాలా వరకూ సింగరేణి కార్మికులే ఉన్నారని గతంలోనూ, తాజా ఆక్రమణల తొలగింపులోనూ హైడ్రా చర్యలపై పలు సందర్భాల్లో కోర్టును ఆశ్రయించినా, ఎక్కడా కూడా ఆయనకు ఊరట లభించని విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసింది.
Also Read: Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

