భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చే లక్ష్యంతో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు (WAVES)ను ఈ ఏడాది చివర్లో కేంద్రం నిర్వహించనుంది. ఇందుకోసం ప్రధాని మోదీ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు అలాగే పారిశ్రామికవేత్తలతో సలహాలు తీసుకుంటున్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సైతం పాల్గొన్నారు.
ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. వరల్డ్ ఆడియో అండ్ విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ (WAVES) కోసం అడ్వైజరీ బోర్డులో భాగం కావడం ఆనందంగా ఉందని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన ఆయన… వేవ్స్ కోసం ఇతర సభ్యులతో కలిసి నా అభిప్రాయాలు పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోదీ ఆలోచనలు దేశాన్ని ముందుకు నడిపించగలవని, అందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో రజనీకాంత్, నాగార్జున అలాగే బాలీవుడ్ నుంచి దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, ఖాన్ త్రయం పాల్గొన్నారు.