Cyber Crime: మీ మొబైల్ ఫోన్కు న్యూ ఇయర్ ఈవెంట్ పాస్ వచ్చిందా? అయితే, ఒక్క క్షణం ఆలోచించండి. అది సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని ఉచ్చులోకి లాగడానికి పంపించింది అయి ఉండొచ్చు. క్రిస్మస్ వేడుకలు సమీపిస్తుండడం, ఆ వెంటనే నూతన సంవత్సర వేడుకలు జరుగనుండడంతో కేటుగాళ్లు వాటి పేర సరికొత్త మోసాలకు తెర లేపుతున్నారు. ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.
రకరకాల మోసాలు
ఇన్వెస్ట్ మెంట్, ట్రేడ్ అంటూ రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఓ కంప్యూటర్ను ముందు పెట్టుకుని జనాన్ని ఉచ్చులో బిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్లు ఏ సందర్భాన్ని కూడా వదలడం లేదు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సం సమయంలో వీఐపీ దర్శనాల పాస్ల పేర వేలాది మందికి టోకరా ఇచ్చి లక్షల్లో డబ్బు కొట్టేశారు. తాజాగా క్రిస్మస్ సమీపిస్తుండడం ఆ వెంటనే న్యూ ఇయర్ వేడుకలు రానుండడాన్ని అవకాశంగా చేసుకుంటూ ఇదే తరహాలో మోసాలకు శ్రీకారం చుట్టారు. జరగని ఈవెంట్, పార్టీల పాస్లు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పబ్బులు, రిసార్టుల పేర ఫేక్ వెబ్ సైట్ల ద్వారా తక్కువ ధరకే అంటూ టికెట్లు అమ్మకానికి పెట్టి డబ్బు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి
టూర్ల ప్యాకేజీల పేర ఆఫర్లు
అదే సమయంలో హాలీడే ప్యాకేజీలు, విదేశీ పర్యటనలు, క్రూయిజ్ టూర్ల ప్యాకేజీల పేర ఆఫర్లు ప్రకటిస్తూ అడ్వాన్స్ రూపంలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. గిఫ్ట్ వచ్చిందని, లక్కీ డ్రాలో అదృష్టం మిమ్మల్నే వరించిందని, క్రిస్మస్ బహుమతి దక్కించుకున్నారని వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా లింకులు పంపిస్తూ ప్రాసెసింగ్ ఫీజు పేర మోసాలు కేటుగాళ్లు చేస్తున్నారు. రిసార్టుల బుకింగ్ పేర కొన్ని నేరాలకు పాల్పడుతుండగా ఈవెంట్ మేనేజ్మెంట్, డెలివరీ పనుల పేర పార్ట్ టైం జాబ్ ఆఫర్లు ఇస్తూ రిజిస్ట్రేషన్ పేర కుచ్చుటోపీ పెడుతున్నారు. ఈ విషయం దృష్టికి రావడంతో జాగ్రత్త అంటూ సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు సూచిస్తున్నారు.
డీసీపీ సూచనలు
అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయవద్దని డీసీపీ చెప్పారు. బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీ, పీఐఎన్, సీవీవీ నెంబర్లను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దన్నారు. ఆఫర్లు, పార్టీల పాస్లు, బుకింగుల గురించి అధికారిక వెబ్ సైట్ల ద్వారా మాత్రమే సంప్రదించాలన్నారు. అపరిచిత వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయవద్దని చెప్పారు. యూపీఐ రిక్వెస్టులను అంగీకరించవద్దని తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు టూ ఫ్యాక్టర్ అథెంటిఫికేషన్ను ఎనేబుల్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, యువత సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అయినా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. దాంతోపాటు
www.cybercrime.gov.in పోర్టల్ కు ఫిర్యాదు చేయాలన్నారు.
Also Read: Cyber Crime: మంచి ఫలితాన్ని ఇస్తున్న గోల్డెన్ హవర్.. మీ డబ్బులు పోయాయా? వెంటనే ఇలా చేయండి

