New Year Drugs Supply: రూ.25 లక్షల విలువైన డ్రగ్స్ సీజ్..
ముగ్గురు సప్లయర్లు అరెస్ట్
సైఫాబాద్ పోలీసులతో కలిసి పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కొత్త సంవత్సర వేడుకల (New Year Drugs Supply) నేపథ్యంలో మాదక ద్రవ్యాల సరఫరాపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు (Hyderabad) సైఫాబాద్ పోలీసులతో కలిసి ముగ్గురు డ్రగ్ సప్లయర్లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి మార్కెట్లో రూ. 25 లక్షల విలువ చేసే 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ థియేటర్ వద్ద కొందరు డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్, సైఫాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో మహ్మద్ గులాం జిలానీ, సులేమాన్ ఖాన్, ఫిరోజ్ బిన్ అలీలను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి డ్రగ్స్తో పాటు 7 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు.
ఓవర్డోస్తో ఒకరి మృతి..
నిందితుల విచారణలో దిగ్భ్రాంతికర విషయం వెల్లడైంది. ఫిరోజ్ బిన్ అలీ ఇచ్చిన సమాచారం ప్రకారం, గులాం జిలానీ నుంచి గ్రాము రూ. 5 వేల చొప్పున బ్రౌన్ షుగర్ కొని, దానిని డ్రగ్స్కు అలవాటు పడిన వారికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు అమ్ముతున్నట్లు తెలిపాడు. గురువారం రోజున శివరాంపల్లికి చెందిన మహ్మద్ అహమద్కు 3 గ్రాముల బ్రౌన్ షుగర్ అమ్మినట్లు బయటపెట్టాడు. ఈ క్రమంలో జరిగిన విచారణలో మహ్మద్ అహమద్ బ్రౌన్ షుగర్ ఓవర్ డోస్ కావడంతో తన ఇంట్లోనే చనిపోయినట్టుగా గుర్తించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ స్టేషన్లో కేసు కూడా నమోదైనట్టు తెలిసింది.
ఒడిశా నుంచి దందా..
ప్రధాన నిందితుడు మహ్మద్ గులాం జిలానీని విచారించగా, రెండేళ్ల క్రితం జార్ఖండ్ నుంచి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడినట్లు చెప్పాడు. తేలికగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన అఫ్సర్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ కొని హైదరాబాద్లో అమ్ముతున్నట్లు ఒప్పుకొన్నాడు. అక్టోబర్ నెలలో ఒడిశా వెళ్లి అఫ్సర్ నుంచి రూ. 3.50 లక్షలకు 115 గ్రాముల బ్రౌన్ షుగర్, 1.350 కిలోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ తెచ్చినట్లు తెలిపాడు. దీంట్లో కొంత భాగాన్ని సులేమాన్ ఖాన్, ఫిరోజ్ బిన్ అలీలకు అమ్మినట్లు వెల్లడించాడు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.

