Hydra: బడాబాబుల కబ్జాలపై సామాన్యులు పోరాటం చేస్తున్నారు. సామాన్యులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. ప్రతి నిర్వహించే ప్రజావాణికి పదుల సంఖ్యలో కబ్జాలపై ఫిర్యాదులు రావటం సామాన్యుల సాహాసానికి నిదర్శనం. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసుకు పోతుంటే గతంలో మాదిరి జనం మౌనం వహించక, ఎదురించేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. దశాబ్దాల సమస్యలకు ఫిర్యాదు స్వీకరించిన వెంటనే హైడ్రా పరిష్కారం చూపడంతో జనం మరింత ధైర్యం, నమ్మకంతో ఫిర్యాదులు చేస్తున్నారు. లే ఔట్లను చూపించి ఆక్రమణలు జరుగుతున్న తీరును వివరిస్తున్నారు. మరి కొందరు ఏకంగా సాక్ష్యాలను కూడా తీసుకొస్తున్నారు. వరద కాలువను బడా బిల్డర్స్ అడ్డుకుంటున్న వైనాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి రహదారుల విషయంలోనూ జరుగుతుంది.
2 వేల గజాల పార్కును హైడ్రా కాపాడింది
లే ఔట్లోకి జరిగి మరీ రహదారులను కాబ్జా చేస్తున్నట్లు కూడా పిర్యాదులందుతున్నాయి. మూసాపేట ఆంజనేయనగర్లో కబ్జాలకు గురైన 2 వేల గజాల పార్కును హైడ్రా కాపాడిందని, దీనిని పార్కుగా అభివృద్ధి చేసే బాధ్యతను కూడా హైడ్రా తీసుకోవాలని అక్కడి నివాసితులు కోరారు. ఈ మేరకు హైడ్రా ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులందినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఏడున్నర గ,టల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల ఫిర్యాదులను నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి సమస్య పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించటం ప్రజా సమస్యల పరిష్కారానికి హైడ్రాకున్న నిబధ్దత కారణమని చెప్పవచ్చు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా అక్కడ పరిస్థితులు గతంలో ఎలా ఉండేవి? ఇప్పుడెలా మారాయన్న విషయాన్ని వివరించి పరిష్కార మార్గాలు సూచించడంతో ఫిర్యాదు దారుల్లో నమ్మకం మరింత పెరిగింది.
ఫిర్యాదులిలా
మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ 7 ఎకరాల పరిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్కడ నివాసముంటున్నాయి. పైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వరద గతంలో సాఫీగా బంధం చెరువుకు వెళ్తుండేది. బంధం చెరువుకు వోక్షిత్ హిల్వ్యూ కాలనీకి మధ్య ఓ నిర్మాణ సంస్థ ఇప్పుడు అపార్టుమెంట్లు కట్టడంతో ఈ వరద కాలువ తమ భూమిలోంచి వెళ్లడానికి వీలు లేదని ఏకంగా మూసేశారని, గతంలో మున్సిపాలిటీ అధికారులు వేసిన పైపులైన్లను ధ్వంసం చేశారంటూ ఫిర్యాదు దారులు వాపోయారు. దీంతో మురుగు, వరద నీరు నిలిచి తమ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నామని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా , హయత్నగర్ మండలం బీఎన్రెడ్డి నగర్ డివిజన్లోని కాప్రాయి చెరువు అలుగులు మూసేయడంతో చెరువు నిండి ఎగువున ఉన్న తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని హరిహరపురం కాలనీ వాసులు హైడ్రా ముందు వాపోయారు. ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు.
Also Read: Hydraa: చెరువు నీటిని ల్యాబ్ టెస్టింగ్ పంపిన హైడ్రా అధికారులు.. ఎందుకో తెలుసా..!
ఈ చెరువు నిండి కిందన ఉన్న బాతుల చెరువుకు నీరు వెళ్లేదని, ఇక్కడ అలుగు ముసేయడం, తూములు బంద్చేయడంతో చెరువు కింద ఉన్న కాలనీల వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 20 కాలనీల వారు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల విలేజ్ సర్వే నెంబరు 454లో 9 ఎకరాల పరిధిలో దాదాపు 155 ప్లాట్లతో 1982లో లే ఔట్ వేశారు.
దీనికి ఆనుకుని ఉన్న 455 సర్వే నంబరులో 1.06 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి తమ లే ఔట్లోకి వచ్చి రహదారులు కబ్జాచేసేసి, కొన్నిప్లాట్లను కూడా కలిపేసుకున్నారని ఆ లే ఔట్లోని ప్లాట్ ఓనర్ల సంఘం ప్రతినిధులు వచ్చి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం వెంకటాపురం బ్యాంక్ కాలనీ లో 372 గజాల ఓపెన్ బావి ఉండేది, దీనిని మట్టితో నింపి ప్రజావసరాలకు కాలనీవాసులు వినియోగించుకునేవారు. అయితే ఇటీవల ఈ స్థలం మాది అంటూ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జాకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు
ఈ స్థలానికి జీహెచ్ ఎంసీ వాళ్లు వేసిన ఫెన్సింగ్ను కూడా తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వాపోయారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్టిగేజ్లో ఉందంటూ బోర్డు పెట్టారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నెంబరు 124/1 లో 200ల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని, పలు కంపెనీలకు గతంలో ఇచ్చిన ల్యాండ్ను వారు వినియోగించుకోకపోవడంతో వెనక్కి తీసుకున్నారు. కాని అక్కడి కంపెనీలు వేర్వేరుపేర్లతో ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడ గతంలో భూములు కోల్పోయిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ విలేజ్ సర్వే నంబరు 48లో 18 ఎకరాల పరిధిలో హృదయ కోఆపరేటివ్ సొసైటీ పేరిట హుడా లేఔట్ ఉండగా, హెచ్ ఎండీఏకు తప్పుడు పత్రాలు సమర్పించి తమ లే ఔట్లోకి ఎకరాన్నర వరకూ జరిగి రహదారులను, ప్లాట్లను కబ్జా చేశారని, ఇరు లే ఔట్లను పరిశీలించి న్యాయం చేయాలని సొసైటీ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. అలాగే కొండాపూర్లోని రాఘవేంద్ర కాలనీలో పాఠశాల భవనానికి, వాహనాల పార్కింగ్కు కేటాయించిన స్థలాలు కొంతమేర ఇప్పటికే కబ్జా కాగా, మిగిలిన వెయ్యి గజాలను కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: Hydraa: మాధాపూర్లో అపురూపమైన ప్రాంతం అందుబాటులోకి రానుంది: కమీషనర్ రంగనాథ్

