Warangal: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురై ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధుల బృందం బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఏడీబీ బృందం నాలా స్థితిగతులను పరిశీలించింది. ఏడీబీ ప్రతినిధులు బల్దియా పరిధిలోని హనుమకొండలోని లష్కర్ సింగారం, వరంగల్ పరిధిలోని ఖిలా వరంగల్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీబీ ప్రతినిధి జితేంద్ర వరద ముంపు ప్రాంతాలలో ఎలాంటి చర్యలు చేపడితే ఉపయుక్తంగా ఉంటుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Heavy Rain In Warangal: వరంగల్ నగరంలో దంచికొట్టిన వర్షం.. పలుచోట్ల వరదలు
పురోగతి అందించడానికి ఏడీబీ కృషి
ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని చాలా దేశాల్లో వరద ముంపు, ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఆర్థిక పురోగతి అందించడానికి ఏడీబీ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల కోసం చేపట్టాల్సిన చర్యలను ఏడీబీ స్థానిక సంస్థలకు సూచిస్తుందని, విపత్తుల ద్వారా దెబ్బతిన్న ప్రాంతాలను పునరుద్ధరించడం, స్థానికులకు పునరావాసం కల్పించడానికి తగు చర్యలు చేపడుతుందని వివరించారు. ముఖ్యంగా, నాలా పక్కన నివాసం ఉంటున్న ప్రజలు వరదల వల్ల ఏ విధంగా ప్రభావితం అయ్యారు.
జీవన ప్రమాణాలు దెబ్బతినే అవకాశం
అనే వివరాలను ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏడీబీ బృందం బల్దియా, ఇరిగేషన్, కుడా, రెవెన్యూ విభాగాల అధికారులతో మాట్లాడింది. వరద వల్ల ప్రభావితమైన ప్రాంతాలు, జరిగిన నష్టం తాలూకు సమాచారాన్ని, అందుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వరదల వల్ల నష్టంతో పాటు ప్రజల ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఇందుకోసం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏడీబీ ద్వారా తగు చర్యలు చేపడతామని జితేంద్ర అన్నారు. ఆయా విభాగాలు సమగ్ర సమాచారాన్ని అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుడా సీపీఓ అజిత్ రెడ్డి, బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, ఇంచార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇరిగేషన్ డీఈలు హర్షవర్ధన్, మధుసూదన్ పాల్గొన్నారు.
Also Read: Warangal: వరంగల్ జిల్లాలో నిమజ్జన ప్రక్రియను ప్రారంభించిన మేయర్, కలెక్టర్
