BIBINagar Lake: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ చెరువు(BB Nagar Lake) ఇటీవలి కాలంలో ‘సూసైడ్ స్పాట్’గా మారి, స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ చెరువు హైదరాబాద్(Hyderabad)కు కూతవేటు దూరంలో ఉండడం, జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకు, కుటుంబ సమస్యలకు చావే పరిష్కారం అనుకుంటూ పదుల సంఖ్యలో ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రమాదకరంగా మారుతున్న చెరువు..
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ చెరువు వద్ద కనీసం రక్షణ వలయం లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుటుంబ తగాదాలు, ఆర్థిక సమస్యలతో జీవితంపై విసుగు చెందిన కొందరు ఈ చెరువులో దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణంలో చెరువు కట్టపై సేద తీరే భక్తులు, సరదాగా ఈత కొట్టడానికి దిగిన కొందరు లోతైన గుంతలను గమనించక ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. చెరువు వద్ద రక్షణ చర్యలు కరువవడంతో ఆత్మహత్యలు, ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. చెరువు చుట్టూ ఫెన్సింగ్ (కంచె)తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Bandi Sanjay: మజ్లిస్ అండతోనే కిడ్నాప్, అత్యాచారాలు.. కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్!
ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి..
సామాజికవేత్త, టైగర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంజాల సురేశ్ గౌడ్ ఈ చెరువు చుట్టూ ఆలోచింపజేసే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. “సమస్యలకు చావే పరిష్కారం కాదని ప్రజలు ఆలోచించాలి. తక్షణమే చెరువు చుట్టూ సీసీ కెమెరాలతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి.”అని కోరారు. క్షుణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడకుండా, జీవితం గొప్పదని ప్రజలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. ఈ ఘటనల నివారణకు అధికారులు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Prabhas: ప్రభాస్కు ఎందుకు అంత క్రేజ్.. పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి రీజన్ ఇదే..
