Hyderabad CPCP Sajjanar: పోలీసు వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ కమిషనర్ వీసీ సజ్జనర్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్హెచ్వోలతో సీపీ సజ్జనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతే ద్యేయంగా మెరుగైన పోలీసింగ్ చేయాలని సీపీ సజ్జనార్ సూచించారు. ప్రతి పోలీస్ అధికారి కూడా 100 శాతం తమ బాధ్యతను నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందిని కేవలం ఒకే పనికి పరిమితం చేయొద్దని, అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వృత్తిని, ఉద్యోగాన్ని ప్రేమిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వివరించారు. తమ పరిధిలో జరిగే విషయాలకు ఎస్హెచ్వోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో కొన్ని కేసుల్లో నిర్లక్ష్యం వహించినట్లు దృష్టికి వచ్చిందని ఆయా కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు.
Also Read: Bus Accident: మరో రోడ్డు ప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ.. బస్సులో 20 మంది విద్యార్థులు
పోలీసింగ్ జాబ్ అనేది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుందని వీసీ సజ్జనార్ అన్నారు. వాటన్నింటిని అధిగమిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ‘అన్ని కేసులను రోటిన్ గా తీసుకోవద్దు. ప్రతి చిన్న నేరాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలి. చిన్న చిన్న నేరాలకు చెక్ పెట్టకుంటే భవిష్యత్లో అది పెద్ద నేరానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ప్రతి కేసును సాంకేతికంగా అన్ని కోణాల్లో విశ్లేషణ చేయాలి’ అని సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. కేసుల దర్యాప్తులను వేగవంతం చేసేందుకు ఏఐని వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని వీసీ సజ్జనార్ చెప్పారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని, దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
