Hyderabad Crime: హైదరాబాద్ శివారు పోచారం ఐటీ కారిడార్ పరిధిలో బుధవారం ఒక గో సంరక్షకుడిపై కాల్పులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీజేపీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కీసర మండలం రాంపల్లికి చెందిన సోనూసింగ్ అలియాస్ ప్రశాంత్ పై నిందితులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఈ కేసును 12 గంటల్లోనే రాచకొండ పోలీసులు ఛేదించారు. నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన రాచకొండ సీపీ.. ఘటనకు గల కారణాలను వెల్లడించారు.
సీపీ ఏమన్నారంటే?
రాచకొండ సీపీ సుధీర్ బాబు కేసుకు సంబంధించిన కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. ‘కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఇబ్రహీం ఖురేషీ (A1)ని అరెస్టు చేశాం. సహ నిందితులు కురువ శ్రీనివాస్ (A3), హసన్ బిన్ మోసిన్ ( A4)లను అరెస్ట్ చేశాం. మరో నిందితుడు హనీఫ్ ఖురేషీ (A2) పరారీలో ఉన్నాడు’ అని సీపీ సుధీర్ స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీం పశువుల రవాణా వ్యాపారం చేస్తున్నాడని.. గోవుల అక్రమ రవాణాను ప్రశాంత్ బయటపెట్టడంతో అతడిపై పగ పెంచుకున్నాడని సీపీ తెలిపారు.
నిందితుడికి రూ.కోటి నష్టం
నిందితుడు ఇబ్రాహీం, బాధితుడు సోను సింగ్ కు గతంలో పరిచయం ఉందని సీపీ సుదీర్ బాబు తెలిపారు. ఇబ్రహీం 12 ఏళ్లుగా పశువుల రవాణ వ్యాపారం చేస్తున్నాడని.. ప్రశాంత్ గతంలో 6 సార్లు పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్నాడని తెలిపారు. దీంతో నిందితుడు ఇబ్రహీంకు రూ. కోటి నష్టం వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు పశువులను రవాణా చేసుకోవాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్ డిమాండ్ చేసినట్లు నిందితులు చెప్పారని సీపీ పేర్కొన్నారు. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: KCR: ప్రజలను ఎలా ఆకట్టుకుందాం.. కోఆర్డినేషన్పై దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్
సెటిల్మెంట్కు పిలిచి.. కాల్పులు
ప్రధాన నిందితుడు ఇబ్రహీం సెటిల్మెంట్ చేసుకుందామని పిలిచి ప్రశాంత్ ను యమ్నంపేట్ స్పాట్ కు బుధవారం సాయంత్రం రప్పించారని సీపీ పేర్కొన్నారు. ప్రశాంత్ అక్కడకు చేరుకోగానే గంటసేపు నిందితుడు అతడితో మాట్లాడారని చెప్పారు. అనంతరం రెండు రౌండ్ల కాల్పులు జరిపి నిందితులు పారిపోయారని స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు ఇబ్రహీం పిస్టల్ ను ఛత్తీస్ గఢ్ లో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులు వాడిన వెహికల్ తో పాటు ఒక పిస్టల్, మూడు సెల్ ఫోన్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు ప్రశాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని సీపీ తెలిపారు. ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 5,110 పశువుల్ని కాపాడినట్లు చెప్పారు. వీటికి సంబంధించి 288 కేసులు నమోదు అయ్యాయని వివరించారు.
