Huzurabad: నిరుపేద, నిరక్షరాస్య కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ పథకాలు, క్లెయిమ్లు దళారులు, అవినీతి అధికారుల పాలిట వరంగా మారుతున్నాయి. హుజురాబాద్ (Huzurabad) సహాయ కార్మిక అధికారి (ALO) కార్యాలయంలో అవినీతి జలగలు పెరిగిపోయాయి. ఇక్కడ పైసలు ఇస్తేనే ఫైల్ కదిలే పరిస్థితి ఉంది. పైసలు ఇవ్వకుంటే ఫైల్ కదిలే ముచ్చటే లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందంటూ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక కార్డుల నమోదు నుంచి వివాహ కానుకలు (మ్యారేజ్ గిఫ్ట్), జనన, మరణ క్లెయిమ్ల (డెత్ క్లెయిమ్స్) వరకు ప్రతి దరఖాస్తుకు అన్నిటికీ ఇక్కడ లంచాలు సమర్పించుకోవాల్సిందేనని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: Huzurabad: అంగన్వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!
బ్రోకర్ల వ్యవస్థతో ఇన్ఛార్జి అధికారి దందా
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, సైదాపూర్ మండలాల నుంచి వందలాది మంది కార్మికులు తమ లేబర్ క్లెయిమ్ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఫిజికల్ ఫైళ్లను సమర్పించడానికి ALO కార్యాలయానికి వస్తుంటారు. అయితే, ఈ కార్యాలయంలో ఇన్ఛార్జి సహాయ కార్మిక అధికారి (I/C ALO) చక్రధర్ బ్రోకర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కార్మికులు గొంతెత్తి చాటుతున్నారు. రూ. 50 వేల వరకు బలవంతంగా
రూ. 50 వేల వరకు బలవంతంగా?
బహిరంగంగానే డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వారానికి ఒక రోజు మాత్రమే కార్యాలయానికి వచ్చే అధికారి చక్రధర్, తన పక్కనే ఒక బ్రోకర్ను కూర్చోబెట్టుకుని బహిరంగంగానే డబ్బులు వసూలు చేయిస్తున్నారనే సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో క్లెయిమ్ ఫైల్ను ముందుకు కదిలించడానికి (ఫార్వార్డ్ చేయడానికి) కార్మికుల నుంచి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు, ఇక అత్యంత కీలకమైన డెత్ క్లెయిమ్లకు అయితే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు బలవంతంగా గుంజుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఫైల్ ఫార్వార్డ్ కు పైసలే ప్రామాణికం!
ప్రభుత్వం జీతం ఇస్తున్నప్పటికీ, తన జేబులు నింపుకోవడానికి ఇన్ఛార్జి అధికారి చక్రధర్ కొంతమంది స్థానిక ఏజెంట్లను, బ్రోకర్లను అక్రమంగా నియమించుకున్నారని తెలుస్తోంది. ఈ బ్రోకర్లు డబ్బులు తీసుకున్న వెంటనే అధికారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెంటనే ఆన్లైన్లో ఫైల్ను ఫార్వర్డ్ చేయడం నిత్యకృత్యంగా మారిందని కార్మికులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టి కార్మికులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పాత అధికారి అవినీతి బాటలోనే చక్రధర్ కూడా పయనిస్తూ నిస్సిగ్గుగా అక్రమార్జనకు పాల్పడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అవినీతి దారుణంపై బాధితుడు ఇచ్చిన సమాచారం
మీడియా ప్రతినిధిని చూసి పారిపోయిన ఏజెంట్ కార్యాలయంలో జరుగుతున్న ఈ అవినీతి దారుణంపై బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు ‘స్వేచ్ఛ’ ప్రతినిధి కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడ గుమ్మిగూడిన కార్మికుల ఆవేదనను తెలుసుకుని, డబ్బుల వసూలు ప్రక్రియను తన కెమెరాలో చిత్రీకరిస్తుండగా… అధికారుల పక్కనే కూర్చుని డబ్బులు తీసుకుంటున్న బ్రోకర్/ఏజెంట్ భయంతో అక్కడి నుంచి హడావుడిగా పారిపోయాడు. దీనిని బట్టి, ఆ కార్యాలయంలో ఎంతటి అవినీతి రాజ్యమేలుతోందో స్పష్టమవుతోంది. నిస్సహాయులైన కార్మికులను పీడిస్తున్న ఇన్ఛార్జి సహాయ కార్మిక అధికారి చక్రధర్పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడుతున్న బ్రోకర్లను కఠినంగా శిక్షించాలని కార్మికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వివాహా కానుక కోసం వెళితే రూ.2 వేలు డిమాండ్ చేస్తున్నారు.
బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
గత నెల రోజుల క్రితం మా కూతురు పెళ్లి చేశాను . నాకు నా భార్యకు లేబర్ కార్డు ఉన్నది. మా భార్య పేరు మీద ఉన్న కార్డు తో మీసేవ కేంద్రం ద్వారా వివాహ కానుక కోసం అప్లై చేశాను. ఫిజికల్ గా ఫైలును లేబర్ కార్యాలయంలో సబ్మిట్ చేయడానికి పోతే అక్కడ ఒక ఏజెంట్ ఆఫీసర్ పక్కన కూర్చొని నన్ను రూ.2000 అడిగాడు, సార్ నన్ను అడగమని ఇక్కడ కూర్చోబెట్టాడు. కష్టాన్ని నమ్ముకుని జీవనం సాగించే మాలాంటి కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం ఇది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అవినీతి అధికారులు, బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి.
బోరగాల సాంబయ్య. దమ్మక్కపేట కార్మికుడు
