Voter Registration: నామినేషన్ చివరి తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సహకరించాలి
రాజకీయ పార్టీల ప్రతినిధులకు జీహెచ్ఎంసీ కమిషనర్ విజ్ఞప్తి
పోలింగ్ బూత్ల వారీగా బీఎల్ఏలను నియమించాలని కర్ణన్ ఆదేశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించే చివరి తేదీ వరకు నియోజకవర్గ పరిధిలోని కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా ఓటు కోసం నమోదు చేసుకోవచ్చుని (Voter Registration) జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సజావుగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కూడా ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 3 లక్షల 98 వేల 982 మంది ఉన్నారని ప్రస్తావించారు. మంగళవారం ఓటరు తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లకు బూత్ లెవెల్ పోలింగ్ ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీలకు కమిషనర్ ఆదేశించారు.
18 ఏళ్లు దాటి ఓటు హక్కు పొందేందుకు అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. రాజకీయ పార్టీలతో కమిషనర్ మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం నియోజకవర్గ ఓటర్ల తుది జాబితా విడుదల చేశామన్నారు. తుది జాబితా ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 3,98,982 మంది ఓటర్లున్నారని వెల్లడించారు. ఓటర్లు తమ పేరును ఓటరు జాబితాలో వెరిఫై చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వెబ్సైట్లో గానీ లేక నేరుగా ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో గానీ సంప్రదించవచ్చునని కమిషనర్ తెలిపారు. రాజకీయ పార్టీలు, పౌరులు ఫారం-6, ఫారం-7, ఫారం-8 లో అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకోవడానికి నామినేషన్ల చివరి తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
గత జులై 1, 2025 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, అర్హులు ఉండి ఇప్పటికీ ఓటరుగా నమోదు చేసుకోని వారు కూడా ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు కావచ్చునని తెలిపారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పడినందున కొంతమంది ఓటర్లను వారికి సమీప పోలింగ్ కేంద్రాలకు మార్చినట్లు ఆయన తెలిపారు. ఈ మార్పును గమనించి ఓటర్లు తుది జాబితాలో తమ వివరాలను చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్ , రాజకీయ పార్టీల తరఫున కె. నందేశ్ కుమార్ (బీఎస్పీ), పొన్న వెంకటరమణ, కొల్లూరు పవన్ కుమార్ (బీజేపీ), విజయ్ మల్లంగి (ఆప్), ఎం. శ్రీనివాసరావు (సీపీఐఎం), పి. రాజేశ్ కుమార్ (కాంగ్రెస్), ముఠా జై, ఎ. శ్రీనివాస్ గుప్తా (బీఆర్ఎస్), కె. జోగేందర్ సింగ్, బి.వై. శ్రీకాంత్ (టీడీపీ), సయ్యద్ ఖలీలుద్దీన్ (ఏఐఎంఐఎం) తదితరులు హాజరయ్యారు.