VC Sajjanar: హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మంగళవారం బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సీపీగా తన తొలి మీడియా సమావేశం నిర్వహించారు. నగర ప్రజలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. అదే సమయంలో క్రిమినల్స్ కు తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.
సజ్జనార్ ఏమన్నారంటే?
మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ‘నేడు సీపీ గా చార్జ్ తీసుకున్నాను. నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకున్న గత అనుభవంతో హైదరాబాద్ సీపీగా విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని హామీ ఇస్తున్నా. టీం వర్క్ కు మారు పేరు హైదరాబాద్ కమిషనరేట్. ఇప్పటి వరకు జరిగిన అన్ని పండగలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా చూశాము. హైదరాబాద్ పోలీసులు సెన్సేషనల్ కేసులు చేధించారు. సీపీగా కొత్త సంస్కరణలు తీసుకు రావడానికి నా వంతు కృషి చేస్తా. ఇందుకు పౌరుల సహకారం కోరుతున్నా. పోలీసులకు ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్క సిటిజన్.. ఒక పోలీస్ ఆఫీసర్. పౌరులు సామాజిక బాధ్యత తో ప్రవర్తించాలి’ అని సజ్జనార్ అన్నారు.
పీపుల్ వెల్ఫర్ పోలీస్ విధానం
పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసుకు తెలంగాణ పోలీసులు మారుపేరుగా నిలుస్తున్నారని సీపీ సజ్జనార్ అన్నారు. ‘ప్రజల సురక్షితం జీవనానికి పీపుల్ వెల్ఫర్ పోలీస్ విధానాన్ని తీసుకు వస్తున్నాం. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఉంది. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తాం. హైదరాబాద్ విశ్వ నగరం.. మనకు డ్రగ్స్ పెద్ద సమస్య. డ్రగ్స్ పై ఇకమీదట ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ కేసులో గతంలో పట్టుబడిన వారి కేసులు పునః పరిశీలిస్తాం. నిందితులకు సంబంధించిన డేటా బేస్ తయారు చేస్తాం. ఈగల్ టీంను మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వం కూడా డ్రగ్స్ పై సీరియస్ గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు టాప్ ప్రయరిటీ డ్రగ్సే’ అని సజ్జనార్ అన్నారు.
‘నేరాలపై అవగాహన పెరగాలి’
ప్రస్తుతం నగరంలో రోజుకో కొత్త రకం సైబర్ కేసులు నమోదు అవుతున్నాయని సజ్జనార్ అన్నారు. ‘వృద్ధులు.. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు ఎవరికీ ఊరికే రావు. అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. సే నో టు డ్రగ్స్ అంటూ నేను మొదలు పెట్టిన క్యాంపెయిన్ విజయవంతం అయింది. బెట్టింగ్ యాప్ లు బ్యాన్ అయ్యాయి. జనాల్లో అవగాహన పెరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ లాంటి పబ్లిక్ కు హాని కలిగించే యాప్ లను ఎవరు ప్రమోట్ చేయొద్దు’ అని పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ సమస్యలపై..
నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు జటిలం అవుతోందని సీపీ సజ్జనార్ అన్నారు. ‘GST తగ్గడంతో వాహనాల సంఖ్య పెరిగాయి. ట్రాఫిక్ పై లాంగ్ టర్మ్ లక్ష్యం పెట్టుకుని పని చేస్తాం. ప్రమాదకరంగా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ లపై దృష్టి సారిస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు సూసైడ్ బాంబ్ లాంటి వారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లపై తనిఖీలు ముమ్మరం చేస్తాము. AI గ్రీవెన్స్ విధానాన్ని తీసుకు వస్తాం. డ్రోన్స్, AI టెక్నాలజీ వినియోగంపై స్టడీ చేస్తాం. డ్రోన్స్ టెక్నాలజీ, AI సాంకేతిక తో పోలీసులకు శిక్షణ ఇస్తాం. ఆడపిల్లలు, చిన్న పిల్లలపై నేరాలకు పాల్పడితే ఊరికే ఉండేది లేదు. సిరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఆడపిల్ల జోలికి వెళ్ళేటపుడు ఇంట్లో తల్లి పిల్లను గుర్తు తెచ్చుకోవాలి’ అని సజ్జనార్ సూచించారు.
Also Read: India vs Pakistan: టీమిండియా తొండి చేసింది.. ఎవరూ ఆ జట్టుతో ఆడొద్దు.. పాక్ మాజీ ఆటగాడి పిలుపు
రౌడీ షీటర్లకు వార్నింగ్
డయల్ 100ను ఇంప్రూవ్ చేసే అంశాలను పరిశీలిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ‘సీసీటీవీల వల్ల బయట నుండి గ్యాంగ్ లు రావడం ఆగిపోయాయి. ప్రతి బిల్డింగ్ లో సీసీటీవీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతాం. ఎక్కువ కష్టపడే పోలీసులు అంటే హైదరాబాద్ పోలీసులు. వారి వెల్ఫేర్ టాప్ ప్రయారిటీ గా తీసుకుంటాం. ఉత్తమ విధులు నిర్వర్తించిన పోలీసులను గుర్తిస్తాం. రివార్డులు ఇస్తాం. ప్రజల వెంట హైదరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఫోన్ ట్యాపింగ్ పై రివ్యూ చేస్తాం. అనంతరం తదుపరి చర్యలపై ఆలోచిస్తాం. రౌడీ షీటర్ లపై ఉక్కుపాదం మోపుతాం. పీడీ యాక్ట్లు పెడతాం’ అని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.