Larry Ellison: ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (Larry Ellison) ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రస్తుతం సంపదలో టాప్ లో ఉండగా.. ఆయన తర్వాతి స్థానాన్ని ఎలిసన్ సొంతం చేసుకున్నారు. ఈ నెలలో (సెప్టెంబర్ 2025) విడుదలైన బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలిసన్ నికర ఆస్తుల విలువ 373 బిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీ ప్రకారం 31.14 లక్షల కోట్లకు సమానం. అయితే తన సంపదలో 95 శాతం దానం చేస్తానని 2010లోనే ఎలిసన్ ప్రకటించారు. దానిని ఏవిధంగా దానం చేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం.
నచ్చిన విధానంలో దానాలు..
2010లో ‘గివింగ్ ప్లెడ్జ్’లో భాగంగా ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ తన సంపదలో 95% దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కానీ ఆయన సంప్రదాయ నాన్ ప్రాఫిట్ సంస్థల దానం చేయకుండా తనకు నచ్చిన విధానంలో దానాలు చేయడానికి ఇష్టపడతానని చెప్పారు. ఫార్చూన్ రిపోర్ట్ ప్రకారం.. ఎలిసన్ ప్రధానంగా తన దానాలను ఎలిసన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Ellison Institute of Technology – EIT) ద్వారా జరుపుతున్నారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఒక ఫర్-ప్రాఫిట్ సంస్థ.
బిలియన్ల కొద్ది విరాళాలు
ఈఐటీ ప్రధానంగా ఆరోగ్యం, ఆహార కొరత, వాతావరణ మార్పులు, AI పరిశోధన వంటి ప్రపంచ సమస్యలపై దృష్టి పెడుతుంది. 2027 నాటికి ఆక్స్ఫర్డ్లో సుమారు $1.3 బిలియన్ విలువైన కొత్త క్యాంపస్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు ఎలిసన్.. USC (University of Southern California)కి $200 మిలియన్లు దానం చేసి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ స్థాపించారు. అలాగే ఆయన ఎలిసన్ మెడికల్ ఫౌండేషన్ (Ellison Medical Foundation) కు దాదాపు $1 బిలియన్ విరాళం ఇచ్చారు. ఈ సంస్థ వృద్ధాప్యం, వ్యాధి నివారణ పరిశోధనలపై పనిచేసింది.
ఇతరులతో పోలిస్తే..
అయితే ఇతర బిలియనీర్లతో పోలిస్తే ఎలిసన్ నేరుగా ఇచ్చిన దానాలు తక్కువే అయినప్పటికీ ఆయన గివింగ్ ప్లెడ్జ్ (Giving Pledge)లో ఇచ్చిన హామీలకు తగ్గట్లే తన ఫౌండేషన్ ద్వారా బిలియన్లలో పెట్టుబడులు పెడుతున్నారు. తన సంపద దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు పెడతాను కానీ అది తన నియంత్రణలో ఉంటుందని ఎలిసన్ ముందే చెప్పారు. దానికి అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం విశేషం.
Also Read: Visa Free Countries: వీసాతో పని లేని 7 పర్యాటక దేశాలు.. ఒక్కసారి వెళ్లారో అక్కడే సెటిల్ అవుతారు!
ఈఐటీలో నాయకత్వ మార్పులు
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. EITలో ఇటీవల నాయకత్వ మార్పులు జరిగాయి. 2024లో శాస్త్రవేత్త జాన్ బెల్ ను రీసెర్చ్ నాయకత్వం కోసం నియమించారు. ఆగస్టులో మాజీ మిచిగన్ యూనివర్సిటీ అధ్యక్షుడు సాంటా ఓనో కూడా బెల్తో కలసి పని చేస్తారని ప్రకటించారు. కానీ రెండు వారాలకే జాన్ బెల్ రాజీనామా చేస్తూ ఇది ‘చాలా క్లిష్టమైన ప్రాజెక్ట్’ అని వ్యాఖ్యానించడం విశేషం.