Huzurabad Collector: అంగన్వాడీ కేంద్రాల నుంచి పేద పిల్లలకు సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు అక్రమంగా బయట అమ్ముడుపోతున్న ఘటనపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు. హుజూరాబాద్ (Huzurabad) పట్టణంలోని రేణుక ఎల్లమ్మ వైన్స్ పర్మిట్ రూమ్లో అంగన్వాడీ కేంద్రాలకు చెందిన గుడ్లు లభ్యమయ్యాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, తక్షణమే విచారణకు ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి ఈ సంఘటనపై సమగ్ర నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా, కలెక్టర్ పమేలా సత్పతి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read: OG premiere: పవన్ కళ్యాణ్ కోసం ‘మిరాయ్’ ప్రొడ్యూసర్ ఏం చేశాడంటే?.. ఫ్యాన్స్కు పండగే..
అధికారులు తీవ్ర ఆగ్రహం
హుజూరాబాద్ద్ (Huzurabad) లోని రంగాపూర్ వన్ అంగన్వాడీ కేంద్రం టీచర్ రాజమ్మను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ (టర్మినేషన్) ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఈ అక్రమాలకు బాధ్యత వహించాల్సిన సూపర్వైజర్ శిరీషకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతేకాకుండా, హుజూరాబాద్ సీడీపీఓ మరాఠీ సుగుణకు కూడా మెమో జారీ చేశారు. నిరుపేదలకు, చిన్నపిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టడంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ కొనసాగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
Also Read: Nongjrang Village: మహా అద్భుతం.. మేఘాల కంటే ఎత్తులో గ్రామం.. లైఫ్లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
అడవిని కాపాడుకునేందుకు గ్రామస్థులు.. ధ్వంసం చేయవద్దని డిమాండ్ చేస్తూ ఛలో కలెక్టరేట్
మా కోసం, మా తరువాతి తరాల కోసం ఊరు అడివిని కాపాడండి అంటూ గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేపట్టారు. అడవి సంరక్షణ కోసం చలో కలెక్టరేట్ పేరుతో ఆందోళనకు దిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో ని రుద్రంగి మండలం మానాల గ్రామస్తులంతా సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు.. కలెక్టరేట్ చౌరస్తాలో “సేవ్ మానాల ఫారెస్ట్”, “పచ్చదనం కాపాడుదాం-ప్రకృతిని నిలబెట్టుదాం” అంటూ నినాదాలతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామ ఫారెస్ట్ ను కాపాడాలంటూ ఎన్నిసార్లు అధికారులను విన్నవించుకున్నా, ఎలాంటి ఫలితం లేదని వారు ఆరోపించారు. కొందరు అక్రమార్కులు అడివిని నరుకుతున్నా స్థానిక ఫారెస్ట్ ఉద్యోగులు చూసిచూడనట్లు నటిస్తున్నారన్నారు. వీరిపై ఫారెస్ట్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమ గ్రామ అడివిని కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామస్థులను ఆందోళన చేయకుండ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన తమ సమస్యకు పరిష్కారం దొరికే దాకా ఆందోళన విరమించేది లేదని గ్రామస్థులు తేల్చి చెప్పారు.
Also Read: Boyinapalli Vinodh Kumar: ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల శంకుస్థాపన: వినోద్ కుమార్
పెద్దపాపయ్యపల్లి, కందుగుల గ్రామాలకు నిధులు మంజూరు
హుజూరాబాద్ మండలం పరిధిలోని పెద్దపాపయ్యపల్లి, కందుగుల గ్రామాల్లో కమ్యూనిటీ హాల్, కబరిస్తాన్ ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో హుజురాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ వోడితేల ప్రణవ్ బాబు చొరవ తీసుకున్నారని మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యల పరిష్కారానికి స్థానిక మైనార్టీ సోదరులు వివిధ పార్టీల నాయకులను సంప్రదించారు.
అయితే, ఎవరూ హామీ ఇవ్వడమే తప్ప చేసిందేమీ లేదని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రణవ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, ఆయన చొరవతో ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.15 లక్షలు మంజూరు చేయించారు. ఈ నేపథ్యంలో, మైనార్టీలు ప్రణవ్కు, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ప్రణవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన మైనార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా ఉందని, ఇలాంటి పరిష్కారాలు ఆ పార్టీకే సాధ్యమని నాయకులు పేర్కొన్నారు.
Also Read: Mahabubabad Rally: ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తక్షణమే విడుదల చేయాలి.. ర్యాలీ నిర్వహించిన నిరుద్యోగులు