HCA Scam: క్రికెట్ అభివృద్ధి కోసం పని చేయాల్సిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association)ను గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమ అవినీతి సంపాదనకు కామధేనువుగా మార్చుకున్నారు. దీని కోసం అడ్డదారుల్లో తమ అస్మదీయులను హెచ్సీఏలో అందలాలు ఎక్కించారు. అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టి అడ్డంగా నిధులు దోచుకున్నారు. తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా వ్యవహరించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు ఇప్పటివరకు జరిపిన విచారణలో హెచ్సీఏలో వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్టుగా నిర్ధారించారు. కాగా, దర్యాప్తు పూర్తయితే మరిన్ని వందల కోట్ల రూపాయల అవినీతి భాగోతం బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం.
నిబంధనలను తుంగలో తొక్కి..
మంత్రులుగా ఉన్న వారు బీసీసీఐ(BCCI)కి చెందిన కమిటీల్లో ఉండరాదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే, వీటిని తుంగలో తొక్కుతూ మాజీ మంత్రి కేటీఆర్(KTR) ను బీసీసీఐ ఐటీ, డాటా మేనేజ్ మెంట్ సబ్ కమిటీకి నామినేట్ చేశారు. 2015–16వ సంవత్సరానికి చెందిన హెచ్సీఏ వార్షిక నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అక్కడితో వ్యవహారం ఆగిందా? అంతే అదీ లేదు. కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్రకు చెందిన ఈవెంట్స్ నౌ డాట్ కామ్ సంస్థకు ఐపీఎల్ మ్యాచ్ ల టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన కాంట్రాక్ట్ ను కట్టబెట్టారు. ఆ సమయానికి హెచ్సీఏ(HCA) ప్రభుత్వానికి 14కోట్ల రూపాయల పన్ను కట్టాల్సి ఉంది. అయితే, తన బావమరిదికి ఐపీఎల్ మ్యాచ్(IPL Match) ల టిక్కెట్ల విక్రయ కాంట్రాక్ట్ దక్కటంతో కేటీఆర్ దీంట్లో హెచ్సీఏకు భారీ ఊరట కల్పించారు. బాకీ పడ్డ టాక్స్ డబ్బును యేటా కేవలం 25 లక్షల రూపాయలు చెల్లిస్తూ తీర్చేలా వెసులుబాటు కల్పించారు.
కాంట్రాక్ట్ ముగిసినా…
ఇక, ఐపీఎల్ మ్యాచ్ ల టిక్కెట్లు విక్రయించేందుకు రాజేంద్ర పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ డాట్ కామ్ కు ఇచ్చిన కాంట్రాక్ట్ 2019 వ సంవత్సరానికి ముగిసింది. అయినా, 2025వ సంవత్సరం వరకు ఆ సంస్థకు యేటా 12 లక్షల రూపాయలను చెల్లిస్తూ వచ్చారు. దీని కోసం డమ్మీ బిల్లులు సృష్టించారు.
Also Read: Suspicious Death: అనుమానాస్పద స్థితిలో ఒంటరి మహిళ మృతి.. ఎక్కడంటే?
కాపీ…పేస్ట్ ఆడిట్ రిపోర్టులు..
ఇక, 2015 నుంచి హెచ్సీఏ యేటా కాపీ…పేస్ట్ ఆడిట్ రిపోర్టులు ఇస్తూ వచ్చింది. దీనిపై ఆడిటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా వాటిని పక్కన పెట్టేశారు. అయితే, 2017, 2023లో జరిపిన ఫోరెన్సిక్ ఆడిట్ లో హెచ్సీఏ నిధుల్లో భారీగా గోల్ మాల్ జరిగినట్టుగా నిర్ధారణ అయ్యింది. అయినా, దీనిపై విచారణ జరపటంగానీ…బాధ్యులు ఎవరన్నది తేల్చటంగానీ…చర్యలు తీసుకోవటంగానీ చెయ్యలేదు.
కాగితాల పైనే క్లబ్బులు..
ఇక, క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ యేటా కోట్ల రూపాయలను హెచ్సీఏకు మంజూరు చేస్తూ వచ్చింది. నిజానికి ఈ నిధులను ఆయా క్రికెట్ క్లబ్బులకు గ్రాంట్ల రూపంలో అంద చేయాలి. క్రీడ అభివృద్ధికి ఖర్చయ్యేలా చూడాలి. దీని కోసం ప్రతీ సంవత్సరం 6.10 కోట్ల రూపాయలను ఆయా క్లబ్బులకు ఇచ్చినట్టుగా హెచ్సీఏ లెక్కల్లో చూపించింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే చాలా క్రికెట్ క్లబ్బులు కేవలం కాగితాలపై మాత్రమే ఉండటం. మరీ విడ్డూరమైన అంశం ఏమిటంటే ఎలాంటి వోచర్లు, సపోర్టింగ్ రికార్డులు లేకుండా నిర్వహణా ఖర్చల కింద 12 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించటం. ప్రైవేట్ క్లబ్బులతో పోలిస్తే ఇనిస్టిట్యూషనల్ క్లబ్బులకు గ్రాంట్ల రూపంలో నాలుగు రెట్ల నిధులు మంజూరు అవుతూ రావటం.
దొడ్డిదారిలో అధ్యక్షుని ఎన్నిక..
హెచ్సీఏకు ఇటీవలి వరకు జగన్మోహన్ రావు అధ్యక్షునిగా పని చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏదైనా రిజిష్టర్డ్ క్లబ్ కార్యవర్గంలో సభ్యునిగా ఉన్నవారు మాత్రమే హెచ్సీఏ అధ్యక్షునిగా పోటీ చేయాలి. దీని కోసం జగన్మోహన్ రావు మాజీ మంత్రి సీ.కృష్ణాయాదవ్ కు చెందిన శ్రీచక్ర క్రికెట్ క్లబ్బుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించాడు. దీని కోసం కృష్ణాయాదవ్ సంతకాలను సైతం ఫోర్జరీ చేశాడు. వీటి ఆధారంగా హెచ్సీఏ అధ్యక్ష స్థానానికి పోటీ చేశాడు. కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రావుకు 63ఓట్లు రాగా ప్రత్యర్థిగా నిలబడ్డ అమర్ నాథ్ కు 62ఓట్లు వచ్చాయి. దీంట్లో కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చక్రం తిప్పినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కారణం…జగన్మోహన్ రావుకు బీఆర్ఎస్ లోని కొందరు పెద్దలతో సన్నిహిత పరిచయాలు ఉండటమే అని హెచ్సీఏ వర్గాలే చెబుతుంటాయి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు జరిపిన విచారణలో జగన్మోహన్ రావు ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా హెచ్సీఏ అధ్యక్షునిగా పోటీ చేసినట్టుగా స్పష్టంగా నిర్ధారణ అయ్యింది.
Also Read: MLA Raja Singh: కిషన్ రెడ్డి దమ్ముంటే రాజీనామా చెయ్?.. రాజాసింగ్ సంచలన కామెంట్స్!