Vande Bharat Sleeper Train: దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లే రైలు అనగానే ఠక్కున వందే భారత్ పేరే గుర్తుకు వస్తుంది. గరిష్టంగా గంటకు 180 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా దీన్ని రూపొందించారు. 2019లో దేశంలో తొలిసారి అందుబాటులోకి వచ్చిన ఈ వందే భారత్ రైలు.. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. అయితే ఇప్పటి వరకూ సీటింగ్ సౌఖర్యాన్ని మాత్రమే కలిగి ఉన్న వందేభారత్ లో త్వరలో స్లీపర్ రైలు సైతం అందుబాటులోకి రానున్నట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలులోని సౌకర్యాలు, ఏ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది? ఏ మార్గాల్లో నడవనుంది? తదితర వివరాలు ఈ కథనంలో పరిశీలిద్దాం.
దిల్లీలో నుంచే ప్రారంభం!
దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. తన మొదటి ప్రయాణాన్ని న్యూ దిల్లీ నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2019లో దేశంలో తొలి వందే భారత్ రైలును దిల్లీ నుంచే ప్రారంభించిన నేపథ్యంలో.. స్లీపర్ సేవలను కూడా దేశ రాజధాని నుంచి ప్రారంభించాలని రైల్వే వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా దిల్లీ రైల్వే స్టేషన్ నుంచే వందే భారత్ స్లీపర్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాకపోతే ఏ మార్గాల్లో ఈ స్లీపర్ రైలును నడపాలన్న దానిపై రైల్వే వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు టాక్.
పరిశీలనలో ఆ మార్గాలు..!
వందేభారత్ స్లీపర్ సేవలను నడిపేందుకు కొన్ని మార్గాలను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. దిల్లీ నుంచి అహ్మదాబాద్ – భోపాల్ – పట్నా (వారణాణి మార్గం ద్వారా) నడిపితే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గాలు పరిశీలనలో ఉన్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గత నెల జరిగిన ఒక కార్యక్రమంలో ఈ రైలు సెప్టెంబరులో ప్రారంభమవుతుందని వెల్లడించారు. అయితే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈ నెలాఖరులో స్లీపర్ సేవలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
స్లీపర్ రైలు ట్రయల్స్!
వందేభారత్ స్లీపర్ రైలులో 24 బోగీలు ఉండనున్నాయి. వందేభారత్ రైళ్ల గరిష్ట వేగం 180 kmph కాగా.. దీనిని 160 kmph వరకు పరిమితం చేసే ఛాన్స్ ఉంది. తొలి 16 బోగీల ప్రోటోటైప్ రైలు జనవరి 15న ముంబై – అహ్మదాబాద్ మధ్య 540 కి.మీ ట్రయల్ రన్ పూర్తిచేసింది. అంతకుముందు రాజస్థాన్లోని కోటా డివిజన్లో జరిగిన చిన్న ట్రయల్స్లో రైలు 180 kmph వేగం అందుకుంది. కాగా, తొలి స్లీపర్ రైలు బోగీలను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2024 డిసెంబర్ 17న తయారు చేసింది.
అధునాతన సౌకర్యాలు
లాంగ్ రూట్లలో రాత్రిపూట ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఈ స్లీపర్ రైలును రూపొందించారు. ఇందులో ఇతర రైళ్లల్లో ఉన్నట్లు ఏసీ ఫస్ట్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ ఉండనున్నాయి. సుమారు 1,128 మంది ప్రయాణికుల సామర్థ్యంతో స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైళ్లల్లో కొన్ని ప్రత్యేకమై సౌఖర్యాలను రైల్వే శాఖ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్రీ వై-ఫై, విమానశ్రేణి ఇంటీరియర్స్, ఆటోమేటిక్ డోర్లు, శబ్దం తక్కువగా వినిపించే ఇన్సులేషన్, కుషన్ బెర్త్లు, రిక్లైనింగ్ సదుపాయం, మెరుగైన సస్పెన్షన్, క్రాష్ బఫర్లు, డీఫార్మేషన్ ట్యూబ్స్, ఫైర్ బారియర్ గోడల వంటి భద్రతా పద్ధతులు ఇందులో ఉండనున్నాయి.
🚨 India’s first Vande Bharat Sleeper Train is scheduled to begin service in September 2025 – Ashwini Vaishnaw. pic.twitter.com/iBGaPf123S
— Indian Tech & Infra (@IndianTechGuide) August 9, 2025
Also Read: Viral Video: కెనడా మెట్రో స్టేషన్లో.. అలాంటి పని చేస్తూ.. కెమెరాకు చిక్కిన ఇండియా అమ్మాయి
ఉత్పత్తి ప్రణాళికలు
ప్రస్తుతం భారతదేశంలో 100 కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. కానీ అవన్నీ చైర్కార్ వెర్షన్లు మాత్రమే. 2024 – 25లో వీటికి 102% ఆక్యుపెన్సీ నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో అది 105%కి పెరిగింది. రాబోయే 5 ఏళ్లలో భారతీయ రైల్వేల్లో మరో 17,000 సాధారణ (నాన్-ఎసీ) బోగీలు జత చేయనున్నారు. అన్ని తరగతుల ప్రయాణికులకు సౌకర్యాలు విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.