IRDAI employee: అందినకాడ అప్పులు చేసి వాటిని తీర్చుకోవటానికి పని చేస్తున్న సంస్థకే కన్నం పెట్టిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) అసిస్టెంట్ మేనేజర్ ను సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ ముత్యంరెడ్డి(DCP Mutyam Reddy) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ పేట్ లోని ఐఆర్డీఏఐలో బాస్కరభట్ల సూర్యనారాయణ(Baskarabhatla Suryanarayana) శాస్త్రి అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సూర్యనారాయణ అవసరాల కోసం పలువురు తెలిసిన వారి నుంచి భారీ మొత్తాల్లో అప్పులు చేశాడు. అయితే, చేసిన బాకీలు చెప్పిన సమయానికి తీర్చలేక పోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వాళ్లు తమ డబ్బు వాపసు చేయాలంటూ అతనిపై ఒత్తిడి తీసుకు రావటం మొదలు పెట్టారు.
Also Read: Jogulamba Gadwal: గద్వాలలో అధ్వానంగా మారిన రోడ్లు!
ఈ క్రమంలో సూర్యనారాయణ పని చేస్తున్న సంస్థనే మోసం చేయాలని పథకం వేసుకున్నాడు. దాని ప్రకారం నకిలీ, ఫోర్జరీ చేసిన ఇన్వాయిస్ లు, ఆఫీస్ నోట్స్, కొటేషన్లు తయారు చేసి ఆ ఫైళ్లను ఉన్నతాధికారుల వద్దకు పంపించటం మొదలు పెట్టాడు. వారి ఆమోదం లభించగానే ఫైళ్లు అకౌంట్స్ విభాగానికి వచ్చేవి. ఉన్నతాధికారుల సంతకాలు పూర్తయిన నేపథ్యంలో అకౌంట్స్ విభాగం ఆయా వ్యక్తుల పేర నిధులు విడుదల చేసేవి.
ఖాతాల్లో జమ
వీటిని సూర్యనారాయణ తన కుటుంబ సభ్యుల పేర తెరిచిన ఖాతాల్లో జమ అయ్యేలా చూసుకునేవాడు. ఇలా సంస్థకు చెందిన రూ5.30కోట్ల రూపాయలను సూర్యనారాయణ కొల్లగొట్టాడు. కాగా, అంతర్గత విచారణలో నిధుల గోల్ మాల్ జరిగినట్టు తెలియటంతో ఐఆర్డీఏఐ వర్గాలు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఏసీపీ హుస్సేన్ నాయుడు నిధులను స్వాహా చేసిన సూర్యనారాయణను సోమవారం అరెస్ట్ చేశారు.
Also Read: Crime News: పిల్లలను కిడ్నాప్ చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. ఎక్కడంటే..?