Crime News: అయిదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ అమ్ముకుంటున్న గ్యాంగ్ ను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బారిన పడ్డ ఆరుగురు పిల్లలను రక్షించారు. నిందితుల నుంచి 5లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ జోన్ డీసీపీ డాక్టర్ వినీత్(DCP Veeneth), మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivass) తో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. లింగంపల్లి పోచమ్మ ఆలయం ప్రాంతంలో గుడిసెలో నివాసముంటున్న ఓ మహిళ గతనెల 26న తాను ఆస్పత్రికి వెళ్లినపుడు నాలుగేళ్ల తన కుమారుడు అఖిల్ కనిపించకుండా పోయినట్టు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరిసర ప్రాంతాలు మొత్తం గాలించినా అఖిల్ జాడ తెలియలేదని పేర్కొంది.
ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పోచమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వాటిని విశ్లేషించగా అఖిల్ ను ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టుగా తేలింది. దాంతో అధికారులు అఖిల్ ను తీసుకెళ్లిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పక్కగా ఆధారాలు సేకరించిన ఈ ప్రత్యేక బృందం గ్యాంగ్ లీడర్ గా ఉన్న చిలుకూరి రాజు(Raju)తో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహా రెడ్డి, బాలరాజును అరెస్ట్ చేసింది.
Also Read: Samantha: ఒక రోజు నాగ చైతన్యతో అలాంటి పని చేశా.. సమంత సంచలన కామెంట్స్
అయిదేళ్లుగా..
ఆయుర్వేద ముందుల స్టోర్ నడుపుతున్న పటాన్ చెరు జేపీ కాలనీ నివాసి చిలుకూరి రాజు తన సహచరులతో కలిసి అయిదేళ్లుగా చిన్నారులను కిడ్నాప్ చేసి సంతానం లేని వారికి అమ్ముకుంటున్నట్టుగా విచారణలో తేలింది. రైల్వే స్టేషన్లు.. జన సంచారం పెద్దగా ఉండని ప్రాంతాల్లో తిరుగుతూ ఈ ముఠా అయిదేళ్ల లోపు వయసున్న పిల్లలను టార్గెట్ గా చేసేవారని వెల్లడైంది. పక్కాగా రెక్కీ జరిపి పిల్లలను కిడ్నాప్ చేస్తూ వస్తున్నారని స్పష్టమైంది. నాలుగేళ్ల క్రితం చిలుకూరి రాజు కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఓ బాలికను కిడ్నాప్ చేసి 42వేల రూపాయలకు అమ్ముకున్నట్టుగా నిర్ధారణ అయ్యింది.
ఆ తరువాత సైబరాబాద్, హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్లతోపాటు సంగారెడ్డిలో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయించినట్టుగా తేలింది. చిలుకూరి రాజు, నర్సింహారెడ్డి లు కలిసి పిల్లలను కిడ్నాప్ చేస్తే మహ్మద్ ఆసిఫ్, రిజ్వానాలు ఆ చిన్నారులను సంతానం లేని తల్లిదండ్రులకు అమ్ముతూ వచ్చారని నిర్ధారణ అయ్యింది. వచ్చిన డబ్బును అంతా కలిసి పంచుకునే వారని తేలింది. ఇక, పటాన్ చెరు ప్రాంతంలో ఉంటున్న భార్యాభర్తలు డబ్బు అవసరమై తమ మూడు రోజులు, ఒక రోజు వయసున్న పిల్లలను మహ్మద్ ఆసిఫ్ ద్వారా సంతానం లేని వారికి అమ్మినట్టుగా వెల్లడైంది.
ఆరుగురిని..
చిలుకూరి రాజు గ్యాంగ్ చేతుల్లో కిడ్నాపై అమ్ముడు పోయిన అఖిల్ (5), అరుణ్ (2), అమ్ములు (8నెలలు), లాస్య (5), అద్విక్ (2), ప్రియ (1)ను పోలీసులు రక్షించారు. వీరిని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు అప్పగించారు. పకడ్భంధీగా విచారణ జరిపి చిన్న పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ ను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ వినీత్ అభినందించారు.
Also Read: Crime News: గంజాయి దందా చేస్తూ పట్టుబడ్డ సెక్యూరిటీ గార్డు.. ఎక్కడంటే..?