Rohit Sharma: బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన బ్రాంకో ఫిట్నెస్ టెస్టులో టీమిండియా దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలే పాల్గొన్నాడు. ఈ టెస్ట్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో, హిట్మ్యాన్ ఫిట్నెస్ టెస్టుల్లో పాసయ్యాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ వయసు 38 ఏళ్లు కావడంతో అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి.
అయితే, వన్డే ఫార్మాట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ బ్రాంకో టెస్టులో కేవలం పాసవ్వడం మాత్రమే కాదని, తన ప్రదర్శనతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆగస్టు 30, 31 తేదీలలో ఫిట్నెస్ట్ టెస్టుల్లో పాల్గొన్నాడని, అతడితో పాటు పాల్గొన్న ఇతర ఆటగాళ్లు అందరూ పాసయ్యారని ‘రెవ్స్పోర్ట్స్ గ్లోబల్’ కథనం పేర్కొంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఈ టెస్ట్ను నిర్వహించారని, రోహిత్ శర్మ శారీరకంగా చాలా ఫిట్గా కనిపించాడని, అందరి మెప్పు పొందాడని వివరించింది. బ్రాంకో టెస్టులో యువ పేసర్ ‘ప్రసిద్ధ్ క్రిష్ణ’ అందరి కంటే మిన్నగా రాణించాడని, చక్కటి ప్రదర్శనతో మంచి స్కోర్ సాధించాడని వెల్లడించింది. కాగా, ఆటగాళ్ల ఫిట్నెస్ను పరీక్షించేందుకు బీసీసీఐ ఇప్పటికే అనుసరిస్తున్న యో-యో టెస్ట్తో పాటు కొత్తగా బ్రాంకో టెస్ట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Read Also- Harish Rao: కాళేశ్వరంపై కమిషన్ నివేదిక డొల్ల.. ఆ రిపోర్టు కోర్టు ముందు నిలబడదు
ఆస్ట్రేలియా సిరీస్కు పచ్చజెండా!
బ్రాంకో టెస్టులో రోహిత్ శర్మ పాసైనట్టుగా తెలుస్తుండడంతో అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్కు చోటుదక్కడం దాదాపు ఖరారైనట్టేననే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 19, 23, 25 తేదీలలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనుంది. అంతకుముందు సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీలలో కాన్పూర్లో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో భారత్ ‘ఏ’ జట్టు మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. అందులో భారత్ ఏ జట్టు తరపున రోహిత్ ఆడతాడా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇదిలావుంచితే, రోహిత్ శర్మ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. భారత్ జట్టు గత ఏడాది జూన్ నెలలో టీ20 వరల్డ్కప్ను ముద్దాడిన తర్వాత, అంతర్జాతీయ టీ20 క్రికెట్కు హిట్మ్యాన్ గుడ్బై చెప్పాడు. దాదాపు ఏడాది తర్వాత, టెస్ట్ ఫార్మాట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. అయితే, టీ20 ఫార్మాట్ నుంచి వైదొలగినంత గర్వంగా టెస్ట్ ఫార్మాట్లో ముగింపు దక్కలేదు. 2024-25లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ అత్యంత దారుణ ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్ జనవరిలో ముగియగా, నాలుగు నెలల తర్వాత ఇంగ్లండ్ సిరీస్కు జట్టుని సెలక్ట్ చేయడానికి ముందు రిటైర్మెంట్ను ప్రకటించాడు.
దీంతో, రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా తరఫున కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. రోహిత్ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో, బ్రాంకో టెస్టులో సానుకూల ఫలితం వచ్చిందనే వార్త అభిమానులకు కొంత ఉపశమనం కలిగించేదేనని క్రీడావర్గాలు అభిప్రాయపడుతున్నారు.
కాగా, బ్రాంకో టెస్టు అనేది ఆటగాళ్ల శరీరానికి, మైండ్కు ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఆటగాళ్ల సత్తా, పరుగులో వేగం, కార్డియో వాస్క్యులర్ కండిషన్ ప్రమాణాలను ఈ టెస్టులో కొలుస్తారు. దీనికోసం తీవ్రమైన రన్నింగ్ డ్రిల్ చేయాల్సి ఉంటుంది. బ్రాంకో టెస్ట్లో 20, 40, 60 మీటర్ల దూరాలను, ప్రతి దూరాన్ని ఐదుసార్లు విరామం లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కోటి ఐదుసార్ల చొప్పున మొత్తం 15 సార్లు, అంతే దగ్గరదగ్గరగా 1,200 మీటర్ల దూరాన్ని విశ్రాంతి తీసుకోకుండా రన్నింగ్ చేయాలి. అది కూడా కేవలం 6 నిమిషాల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది.