Tummala Nageswara Rao: భవిష్యత్ అంతా ఉద్యానపంటలదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఆదాయం పెరగడానికి ఉద్యాన పంటలు ఒక గ్రోత్ ఇంజన్గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోనే అన్ని సౌకర్యాలతో హార్టికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల కంటే వ్యవసాయరంగానికే అత్యంత ప్రాధాన్యం ఉందని వెల్లడించారు. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీలో అక్షయ డైనింగ్ హాలును మంగళవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది
గత 4 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో అన్ని వ్యవస్థలు మూతపడినా, నాగలి ఆగలేదని, రైతు శ్రమ ఆగలేదని, ఇంకా ఎక్కువ మొత్తంలో దిగుబడులు సాధించడం జరిగిందన్నారు. హార్టికల్చర్ విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, విద్యార్థులుగా ప్రావీణ్యతను పెంచుకుంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా, వారికే ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నారు. విద్యార్థులు(Students)కోర్సులో సగానికి కన్నా ఎక్కువ రోజులు పోలాల్లో ఉండి, వ్యవసాయంలో ప్రావీణ్యం సంపాదించుకోవాలన్నారు. రైతు చేసే వ్యవసాయ విధానాలను పరిశీలించాలన్నారు.
ప్రణాళిక సిద్ధం
హార్టికల్చర్ పంటలను అభివృద్ధి చేస్తే, అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దేశంలో లక్ష కోట్లతో పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, పామాయిల్ దిగుమతి తగ్గించాలంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఎకరాల్లో ఉన్న పామాయిల్ పంటను 70 లక్షల ఎకరాలకి విస్తరించినట్లయితే, డిమాండ్ను అధిగమించడానికి ఛాన్స్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్సాగు చేసేందుకు, ఆయిల్ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, రానున్న 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో పామాయిల్ పంటను 10 లక్షల ఎకరాలకు విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కూరగాయలు, పండ్ల తోటలతో పాటుగా జాజి, వక్క, మెకడమియా లాంటి అన్ని పంటలను పండించడానికి తెలంగాణ నేలలు అనుకూలంగా ఉన్నాయన్నారు.
హార్టికల్చర్ శాస్త్రవేత్తలు, రైతులు హార్టికల్చర్ పంటలు సాగుచేయడానికి అవసరమైన పరిశోధనలను విస్తృతం చేసి, సూచనలు సలహాలు అందించాలన్నారు. యూనివర్సిటీలో పరిశోధన, సాంకేతిక పరిజ్ఙానం, ఆధునిక బోధన విషయాలలో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వైస్ చాన్స్లర్ రాజిరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రెటరీ రఘునందన్ రావు, వ్యవసాయ కమిషన్ సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
Also Read: Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు