Jangaon district: మనం సాధారణంగా ర్యాగింగ్ కాలేజీల్లో చూసే వాళ్ళం. అదికూడ ప్రభుత్వాలు సిరియస్గా తీసుకుని నిషేధించిన తరువాత అది కాలేజీల్లోను కానరావడం లేదు. ప్రాణం పోసే దేవాలయాలుగా పేద ప్రజలు భావిస్తున్న పలు సర్కారు దావాఖానాల్లో ర్యాగింగ్ భూతం రాజ్యం ఏలుతుంది. పనిచేసే డాక్టర్(Doctor) నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు దేవుళ్లకు ప్రతిరూపాలుగా రోగులు భావిస్తుంటారు కానీ వృత్తి నిబద్ధత మరణించిన కొందరు సిబ్బంది రోగులకు నయానో భయానో మంచో చెడో చీత్కరించుకుంటూ.. తిట్టుకుంటూ ఏదో రకంగా చికిత్స చేస్తుంటారు. ఇది నిత్యం మనకు దావాఖానాల్లో ప్రతి ఒక్కరికి కనిపించే దృశ్యమే. దావాఖానాల్లో పనిచేసే సిబ్బంది రోగులను చూసే విధానం చూస్తే మనసును పిండేస్తుంది.
ఈ పేద రోగులు దావాఖానాల్లో పనిచేసేవారికి నిత్యం కనిపించేవారు కాదు. కలిసి ఉండేవారు కాదు. రోగం వస్తేనే దావాఖానాకు పోతారు. అందుకే కాబోలు రోగులు కూడా సిబ్బంది చీత్కారాలు, కోపాలు, తాపాలు భరించుకుంటూనే వైద్యం చేయించుకుని ఎవ్వరి దారిన వారు పోతుంటారు. ఇది రోగులతో డాక్టర్లు, నర్సులు, ఏ ఎన్ ఎంలు వ్యవహరించే తీరు. ఇది నాణానికి ఒక కోణం. అదే నాణానికి మరో కోణం చూస్తే నిత్యం కలిసి ఉండే జూనియర్ ఉద్యోగులను సీనియర్ ఉద్యోగులు చేసే ర్యాగింగ్ ఎంతో విచిత్రంగా ఉంటుంది.
నమస్తే పెట్టుకుంటే చుక్కలు చూపిస్తారు
కళాశాలల్లో, క్యాంపస్ల్లో ర్యాగింగ్ భూతానికి ఎందరో విద్యార్థులు బలయ్యారు. ఇప్పుడు సర్కారు దావాఖానాల్లో(Govt Hospital) సీనియర్లకు జూనియర్లు బలి అవుతున్నారు. నమస్తే మేడమ్ అనలేదో.. ఇక జూనియర్లకు సీనియర్లు చుక్కలు చూపిస్తారు. సర్కారు దావాఖానాల్లో సీనియర్లు జూనియర్లను నమస్తే పేరుతో చేస్తున్న ర్యాగింగ్ అంతా ఇంతా కాదని జూనియర్లు ఆవేధన చెందుతున్నారు. జనగామ(Janagama) జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్కారు దావాఖానాల్లో ఇదే పరిస్థితి నెలకొందని కొందరు జూనియర్ ఏఎన్ఎంలు, నర్స్లు స్వేచ్ఛ ప్రతినిధికి తెలిపారు. జూనియర్ సిబ్బంది సీనియర్లను నమస్తే అని తప్పకుండా అనాలి. అనకుంటే ఆ రోజు వారికి నరకమే.
సీనియర్లే జూనియర్లకు నమస్తే మేడమ్ అంటూ వెటకారంతో పలకరిస్తారట. ఏం మేడమ్ ఏం చేస్తున్నారు.. మీరు బాగా పెద్దోల్లు అయ్యారు. మీ కంటికి మేము కనిపించడం లేదు. ఇప్పుడు నీదే హవా నడుస్తుందట కదా. నీవు చెప్పిందే వేదమట కదా.. ఎంతైనా మీరు చాలా పెద్దోల్లు మేడమ్. మీకు నమస్తే పెట్టకుంటే మాకు ఇబ్బందులు. ఏమి అనుకోవద్దు మేడమ్. నీకు అధికారులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయట కదా.. అందుకే నీవు చెప్పిందే వేదమట కదా. దయచేసి మీరు ఏమి అనుకోవద్దు మేడమ్. నేనే ఇక ముందు మీకు నమస్తే అంటాను.. కొంచేం దయుంచుండి మేడమ్ అని వెటకారపు మాటలతో.. సూటిపోటి పలకరింపులతో సీనియర్లు ర్యాగింగ్ చేస్తారని జూనియర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ ఏ ఎన్ ఎం తెలిపింది.నేను చెప్పానని తెలిస్తే రేపటి నుంచి నా బతుకు కుక్కలు చింపిన ఇస్తరి అవుతుంది.
Also Read: Eco Tourism: ఎకో టూరిజంపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
నచ్చకుంటే నరకం చూపిస్తారు
జూనియర్లు నమస్తే పెట్టకుంటే.. ప్రతి రోజు డ్యూటీలు వేయడం, నైట్ డ్యూటీలు ఎక్కువగా వేయడం, సెలవులు కావాలన్నప్పుడు ఇవ్వకుండా వేధించడం, పై అధికారులకు వచ్చినప్పుడు లేనిపోనివి చాడీలు చెప్పి చీవాట్లు పెట్టించడం, మెమోలు ఇప్పించడం, గొడ్డు చాకిరి చేపించడం, అనవసరపు నిందలు వేసి జీవితాలను బుగ్గిపాలు చేయడం, బూతు మాటలతో హింసించడం సీనియర్ల ర్యాగింగ్కు పరాకాష్టగా మారాయని జూనియర్లు చెపుతున్నారు. కొందరు సీనియర్లు జూనియర్లకు మంచిగా శిక్షణ ఇచ్చి, వారిని ప్రయోజకులను చేస్తే మరి కొందరు మాత్రం ఇలా ర్యాగింగ్(Raging) చేస్తూ శునకానందాన్ని పొందుతారని ఓ స్టాప్ నర్స్(Staff Nurse) వాపోయారు. ఇక సీనియర్లకు అండదండలు అందించే అధికారులు కూడా జూనియర్ సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తుంటారని అన్నారు. ఈ ర్యాగింగ్ భూతాన్ని తరమెయాలని, సీనియర్ల నుంచి రక్షణ కల్సించాలని పలువురు జూనియర్ సిబ్బంది వేడుకుంటున్నారు. ఇది ఒక జిల్లా కాదు అన్ని జిల్లాల్లోని వైద్య శాఖలో ఇదే తంతు కొనసాగుతుందని పలువురు పేర్కొన్నారు.
వేధింపులతో ఆత్మహత్య యత్నం, కావాలని ట్రాన్స్ఫర్
జూనియర్ సిబ్బందిని ర్యాగింగ్ చేయడం సిబ్బందిని తిట్టడం, వేధించడం.. ఇక రోగులపట్ల ఇష్టా రాజ్యంగా వ్యవహరించడం దురుసు ప్రవర్తన శరామామూలుగానే మారింది. సీనియర్ల వేధింపులతో వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని ఓ పిహెచ్ సి లో పని చేసిన 2 ఏ ఎన్ ఎం వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. జనగామ జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పని చేసే ఏఎన్ఏం(ANM) వేధింపులు భరించలేక వరంగల్(Warangal) ఎంజీఎం కు పట్టుబట్టి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.
ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. పలువురు హెడ్ నర్స్ లు సిబ్బందిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైన వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుని సిబ్బంది పని తీరు మెరుగు పర్చడంతోపాటు రోగులపట్ల మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
అంతే కాకుండా ఎక్కువ వేతనం పొందే రెగ్యులర్ ఉద్యోగులు పార్ట్ టై, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో తక్కువ వేతనంకు పని చేసే సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ వారితో చాకిరి చేయిస్తూ వారిని వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారిని చిన్నచూపు చూస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపనలు సైతం వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ ప్రత్యేక నిర్ణయం.. వారికి ఆఫర్ లెటర్ అందజేత?