Vasavi Construction Company: నాలాలు, వరద కాలువల కబ్జాలపై హైడ్రా(Hydraa) సీరియస్ యాక్షన్ కు సిద్దమైంది. భరత్నగర్ – ఖైతలాపూర్ మార్గంలోని కాముని చెరువు – మైసమ్మ చెరువులను కలుపుతూ సాగే వరద కాలువను కబ్జా చేసిన వాసవీ నిర్మాణ సంస్థపై హైడ్రా పోలీసు కేసు నమోదు చేయించినట్లు హైడ్రా అధికారులు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 17 మీటర్ల వెడల్పుతో పాటు ఇరువైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ వదలకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ ఏవీరంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని ముల్లకత్వ చెరువు – కాముని చెరువు – మైసమ్మ చెరువులను కలుపుతూ వెళ్లే వరద కాలువలో మట్టి పోసినట్టు కమిషనర్ నిర్థారించారు. నిర్మాణ సంస్థపై కేసు పెట్టాలని హైడ్రా కమిషనర్ అధికారులను ఆదేశించారు.
కాలువను ఆక్రమించి నిర్మాణాలు
నాలా ఆక్రమణలను వెంటనే తొలగించాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా(Hydraa) అధికారులు జేసీబీలతో, టిప్పర్లతో మట్టిని తొలగించారు. ఆ మట్టిని వాసవీ నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే తిరిగి వేశారు. వరద కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారంటూ, వాసవీ నిర్మాణ సంస్థపై కూకట్పల్లి(Kukatpally) పోలీసు స్టేషన్లో ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతమేర ఇరువైపులా రిటైనింగ్ వాల్స్తో నిర్మించిన కాలువ మధ్యలో స్లాబ్ వేసేందుకు ఉద్దేశించిన పిల్లర్లను కూడా తొలగించాల్సి ఉందని హైడ్రా అధికారులు గుర్తించారు. వాసవీ సరోవర్ పేరిట ఖైతలాపూర్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడే వరద కాలువకు సంబంధించిన నిబంధనలను పాటించాలని హైడ్రా హెచ్చరించిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Also Read: MLC Kavitha: నల్లగొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడు: ఎమ్మెల్సీ కవిత
కంచెతో కబ్జాలకు చెక్
రంగారెడ్డి(Rangareddy) జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ గ్రామంలో 200ల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా(Govt Land) కాకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV.Ranganadh) తెలిపారు. ఇక్కడ దేవాలయాలకు, దర్గాకు 10 ఎకరాల వరకూ భూమి ఇచ్చినట్టు చెబుతున్నారని, దీనిని కూడా రెవెన్యూ వాళ్లతో పరిశీలిస్తామన్నారు. ఆ మేరకు హద్దులు నిర్ధారించి కంచెలు వేస్తామన్నారు. 452/1, 454/1 సర్వే నంబర్లలో ఉన్న కొండలను పరిరక్షించాలని కోరుతూ సొసైటీ టూ సేవ్ రాక్స్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ మతాలకు సంబంధించి కేటాయించిన భూముల వివరాలను తెలుసుకున్నారు.
భగీరథమ్మ చెరువును కూడా
త్వరలోనే వారందరితో సమావేశం ఏర్పాటు చేసి, వారికి కేటాయించిన భూముల మేరకు ఫెన్సింగ్ వేసి అంతవరకే పరిమితం చేసి, మిగతా భూమిని పరిరక్షిస్తామన్నారు. ఎంతో ఎత్తుగా, సహజ సిద్ధంగా ఉన్న గుట్టలను, ఏళ్ల సంవత్సరాల చరిత్ర గల కొండలను కాపాడితే, ప్రకృతిని పరిరక్షించనట్టవుతుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే హైకోర్టు ఉత్తర్వులను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా పరిరక్షించాలని స్థానికులు కోరారు. చెరువుకు వరద నీరు వచ్చే ఇన్ లెట్స్ ను కూడా మూసేశారని, చారిత్రక గుట్టల చెంతనే ఉన్న ఈ చెరువును కాపాడాల్సిన అవసరముందని ఆయన గుర్తు చేశారు. నార్సింగ్ ప్రాంతంలో 160 ఎకరాల మేర ఉన్న చారిత్రక రాళ్ల గుట్టలను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు.
Also Read: Fraud Loans: ముద్ర రుణాల పేరుతో మోసాలు నిందితుడి అరెస్ట్