Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) నగరానికి వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. రానున్న నాలుగురోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు సూచించింది. దీంతో వర్షం సహాయక చర్యలపై జీహెచ్ఎంసీ,(GHMC) నగర ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇప్పటికే భారీ వర్షం కురిసినపుడు నీరు నిల్వ ఉండి, వాహానాల రాకపోకలకు కష్టాలను సృష్టిస్తున్న నగరంలో 144 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వాహనదారులు అయోమయానికి గురి కాకుండా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
Also Read: Medical College Professors: మెడికల్ కాలేజీల్లో తీరనున్న ప్రొఫెసర్ల కొరత
ప్రతి వాటర్ లాగింగ్ పాయింట్ వద్ద జీహెచ్ఎంసీ(GHMC) గానీ, ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపట్టారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు అలర్ట్ రావటంతో ఐటీ కారిడార్లో విధులు నిర్వర్తించే ఐటీ ఉద్యోగులకు ఆయా ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు సలహా ఇచ్చినట్లు సమాచారం. వాతావరణ శాఖ అలర్ట్ మేరకు జంట నగరాల్లోని ప్రజలు అత్యవసరమైతే తప్ప, బయటికి రావొద్దని వివిధ విభాగాల అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై సిటీల పరిధిలోని జీహెచ్ఎంసీ, పోలీసు, ట్రాఫిక్ పోలీసు, జలమండలి, ఆర్టీసీ, ఫైర్తో పాటు హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీలో రౌండ్ ది క్లాక్ పనిచేసే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 తో పాటు మై జీహెచ్ఎంసీ యాప్, డయల్ 100కు వర్షం సహాయక చర్యల కోసం కాల్ చేయాలని అధికారులు సూచించారు.
ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్ ఆర్వి కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్తో(Ranganath)కలిసి పలు వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. నగరంలో వర్షపు నీరు నిలుస్తూ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా సిబ్బంది కలిసి సమన్వయంతో పని చేయాలని కూడా సూచించారు.
మెడికవర్ హాస్పిటల్ సమీపంలోని జూబ్లీ ఎన్క్లేవ్ కమాన్ వద్ద వరద నీటి డ్రైనేజీని కమిషనర్ పరిశీలించారు. ఆ తర్వాత, శిల్పరామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట లేక్స్ ఔట్లెట్ పాయింట్ను సందర్శించారు. హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ రోడ్డుపై స్మైలైన్ డెంటల్ వద్ద నీటి నిల్వ పాయింట్ను పరిశీలించారు. యశోద రోడ్డుపై నీటి డ్రైయిన్ నిర్మించాలని, తమ్మిడికుంట సరస్సు వద్ద హైడ్రా వ్యర్థాలను తొలగించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వర్షం పడినప్పుడు వరదతో పాటు పెద్ద మొత్తంలో చేరుతున్న సిల్ట్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నిత్యం అప్రమత్తంగా ఉండి వరద నివారణతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ పర్యటనలో కమిషనర్తో పాటు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గజరావు భూపాల్, జోనల్ కమిషనర్ (శేరిలింగంపల్లి జోన్) భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Also Read:Hari Hara Veera Mallu Review: హరిహర వీరమల్లు జెన్యూన్ రివ్యూ