Heavy Rains: భారీ వర్షానికి హైదరాబాద్ (Hyderabad) జనజీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన వానకు చాలా ప్రాంతాల్లో వరదనీరు ముంచెత్తింది. ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జ్పై నడుము లోతులో నీరు ప్రవహించింది. చాలా చోట్ల వాహనదారులు ట్రాఫిక్ జామ్తో నరకయాతన అనుభవించారు. గాలి దుమారంతో చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఏకధాటి వర్షం
నగరంలో వర్సం ఏకధాటిగా కురవడంతో రోడ్లపైకి వరద నీరు భారీగా చేరింది. చాలా చోట్ల చెరువులను తలపించేలా వరద నీరు ప్రవహించింది. స్కూళ్లు, ఆఫీసులు వదిలి పెట్టే సమయంలో భారీ వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కంటోన్మెంట్ ఏరియాలో అత్యధికంగా 11.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోయిన్ పల్లిలో 11.45 సెంటీమీటర్లు, నాచారంలో 10.13, ముసారం బాగ్లో 9.85, అడ్డగుట్టలో 9.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read: Heavy Rains Hyderabad: వర్షాల నేపథ్యంలో అధికారులకు సీఎం కీలక ఆదేశం!
హుస్సేన్ సాగర్ ఫుల్
వరద నీటి కారణంగా హుస్సేన్ సాగర్ (Hussain Sagar) ప్రమాదకర స్థాయిలో ఉన్నది. చుట్టుపక్కల ఏరియాల నుంచి భారీగా వరద నీరు చేరుతున్నది. ఫుల్ ట్యాంక్ లెవెల్కు నీటిమట్టం చేరుకున్నది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 513.38 మీటర్లకు నీరు చేరుకున్నది.
తప్పిన పెను ప్రమాదం
చాంద్రాయణ గుట్టలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ ప్రహరీ గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్దగా ప్రమాదం తప్పింది. కాస్త దూరంగా ఓ కారు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అలాగే, పద్మా నగర్ ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వరద నీటితో కాలనీ జలమయమైంది. మరోసారి అదే పరిస్థితి నెలకొన్నది. నాలా పక్కన భవనాలు ఉండడంతో గోడ కూలిపోయింది. దీంతో పునాది దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయని జనం భయపడుతున్నారు. నాలాలో ప్రవహిస్తున్న నీళ్ల తాకిడికి గోడ కూలిపోయింది. ఆనుకుని ఇళ్లు ఉండడంతో అవి కూడా కూలిపోయే అవకాశం ఉండడంతో అక్కడ నివసిస్తున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు అక్కడ ఉన్న వారిని ఖాళీ చేయించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన సాయం కోసం జీహెచ్ఎంసీని (GHMC) ఆశ్రయించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) సూచించారు. శుక్రవారం సాయంత్రం మొదలైన వర్షం గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కురిసింది. ఈ నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి నగరవాసులను అప్రమత్తం చేయడంతోపాటు, అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు ఉన్నాయని, అత్యవసరమైతేనే బయటకు రావాలని లేదంటే ఇంటికే పరిమితం కావాలని సూచించారు. నగరవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మాన్సూన్ ఎమర్జెన్సీ, హైడ్రా బృందాలు ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని ఆమె ఆదేశించారు.
Also Read: Hyderabad Heavy Rains: నగరంలో భారీ వర్షం .. ట్రాఫిక్తో వాహనదారుల ఇక్కట్లు