Crime News: ప్రేమకు అడ్డుగా ఉన్నదని ఈ మధ్య ప్రియుడితో కలిసి కన్నతల్లినే కుమార్తె కిరాతకంగా హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది. ఇది మరిచిపోక ముందే అలాంటి దారుణమే మరొకటి వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు చెబుతున్నాడని ఓ కూతురు ప్రియుడు, తల్లితో కలిసి కన్నతండ్రినే హత్య చేసింది. ఆ తరువాత ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లింది. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఎదులాబాద్లోని లక్ష్మీనారాయణ చెరువులోకి విసిరేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముషీరాబాద్ (Musheerabad) ప్రాంత నివాసి వడ్లూరి లింగం పాతబస్తీలోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతని భార్య శారద (GHMC) జీహెచ్ఎంసీలో స్వీపర్గా ఉద్యోగం చేస్తున్నది. వీరి పెద్ద కూతురు మనీషా(25). కొంతకాలం క్రితం మంచి సంబంధం చూసి కుమార్తెకు లింగం పెళ్లి చేశాడు.
Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్
హత్య చేసేందుకు కుట్ర
కొన్నాళ్లకు భర్త స్నేహితుడు జవహర్ నగర్ బీజే నగర్కు చెందిన మహ్మద్ జావీద్(24)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలిసిన మనీషా భర్త ఆమెను వదిలేశాడు. అప్పటి నుంచి ప్రియుడు మహ్మద్ జావీద్తో కలిసి మనీషా మౌలాలిలో నివాసముంటోంది. తన కూతురు భర్తను వదిలేసి మరొకరితో కలిసి ఉండడం నచ్చని లింగం ఆమెతో పలుమార్లు ఈ విషయమై ఘర్షణ పడ్డాడు. దాంతో మనీషా తండ్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నింది. ఇందులో తన తల్లి శారద, మహ్మద్ జావీద్లను భాగస్వాములుగా చేసుకున్నది.
సెకండ్ షో సినిమాకు
చేసిన కుట్ర ప్రకారం ఈ నెల 6న తండ్రికి నిద్రమాత్రలు కలిపిన కల్లు తాగించింది. ఆ తరువాత మనీషా, మహ్మద్ జావీద్, శారద కలిసి అతడి ముఖాన్ని దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టిన మనీషా, జావీద్ సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా చూసి ఇంటికి వచ్చిన తరువాత క్యాబ్ బుక్ చేసి తండ్రి మృతదేహాన్ని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదులాబాద్ తీసుకెళ్లారు. క్యాబ్ డ్రైవర్ అనుమానం వ్యక్తం చేయగా కల్లు తాగాడని చెప్పారు. ఎదులాబాద్లోని లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లిన తరువాత క్యాబ్ను వెనక్కి పంపించి వేశారు.
పోలీసులు తమదైన శైలిలో విచారణ
ఆ తరువాత మనీషా, మహ్మద్ జావేద్, శారద కలిసి లింగం మృతదేహాన్ని చెరువులోకి విసిరేసి అక్కడి నుంచి ఉడాయించారు. మరుసటి రోజు మృతదేహం నీటిపైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల పుటేజీని సేకరించి విశ్లేషించారు. లభించిన ఆధారాలతో మనీషా, మహ్మద్ జావీద్, శారదలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మొదట తమకేం పాపం తెలియదని చెప్పిన ముగ్గురు, ఈ నెల 6న లింగం ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదన్నారు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు.
Also Read: Mulugu District: రాజకీయ దుమారం రేపిన రమేష్ ఆత్మహత్య