Air India Crash: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగి 20 రోజులు పూర్తయ్యింది. జూన్ 12న జరిగిన ఈ ఘోర విషాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒక్కరు మినహా అందరూ చనిపోయారు. విమానం కూలిన జేబీ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు 33 మందికిపైగా చనిపోయారు. మొత్తం 270 మందికి పైగా ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదిక వారం రోజుల వ్యవధిలో విడుదల కానుంది. జూలై 11 లోగా ప్రాథమిక రిపోర్టు బయటకు రానుంది. నాలుగు నుంచి ఐదు పేజీల వరకు ఈ రిపోర్ట్ ఉండనుంది. విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక వివరాలు అన్నింటినీ ఇందులో పొందపరచనున్నారు. ప్రమాదానికి ప్రాథమిక కారణాలను కూడా ఇందులో ప్రస్తావించే అవకాశాలు ఉన్నట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానం వివరాలు, అందులోని సిబ్బంది, అహ్మదాబాద్ ఎయిర్పోర్టు పరిస్థితులు, జూన్ 12న విమానం కూలిపోయినప్పుడు వాతావరణం వంటి వివరాలు అందులో ఉంటాయి. టేకాఫ్ అయిన దాదాపు 30 సెకన్ల తర్వాత కూలిన విధానం వంటి వివరాలన్నీ నివేదికలో ఉంటాయని తెలిపాయి.
Read also- RCB Stampede: ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బ.. సెంట్రల్ ట్రిబ్యునల్ సంచలనం
విమాన శిథిలాలకు సంబంధించిన వివరాలు కూడా ఉంటాయని దర్యాప్తులో భాగమైన ఓ అధికారి చెప్పారు. ప్రాథమిక నివేదిక దర్యాప్తు పురోగతిని తెలియజేస్తుందని, దర్యాప్తులో భాగంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలు, దర్యాప్తునకు అవసరమయ్యే కీలక విభాగాలను ఇందులో హైలెట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) మార్గదర్శకాల ప్రకారం, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక రిపోర్టును విడుదల చేస్తోందని సమాచారం.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తుపై పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఇటీవలే మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ‘‘విమాన ప్రమాదం దురదృష్టకర ఘటన. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది. విధ్వంసంతో పాటు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు బృంద అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ అంచనా వేస్తున్నారు. దీనిపై అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. రెండు ఇంజిన్లు ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదు. పూర్తి దర్యాప్తు నివేదిక వచ్చాక అది ఇంజిన్ సమస్యనా లేక ఇంధన సరఫరాలో సమస్యనా, లేదా రెండు ఇంజిన్లు ఎందుకు ఆగిపోయాయనేది నిర్ధారించగలుగుతాం. బ్లాక్ బాక్స్లో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసిన సీవీఆర్ (కాక్పిట్ వాయిస్ రికార్డర్) కూడా ఉంది. దానిపై ఇప్పుడే మాట్లాడడం చాలా తొందరగా అవుతుంది. కారణం ఏదైనా కచ్చితంగా బయటకు వస్తుంది’’ అని మంత్రి పేర్కొన్నారు.
Read also- Law Student: లా విద్యార్థినిపై అఘాయిత్యానికి ముందు ఏం జరిగిందో బయటకొచ్చింది!