Syringe Horror: ఫ్రాన్స్ అంతటా బాగా పాపులర్ అయిన ‘ఫెటెస్ డి లా మ్యూజిక్ ఫెస్టివల్’ ఈ ఏడాది దేశవ్యాప్తంగా హర్రర్గా మారింది. మ్యూజిక్ వేడుకల వద్ద ప్రేక్షకులపై కొన్ని గుర్తుతెలియని ముఠాలు ‘సిరంజి దాడులు’ జరిపాయి. దేశవ్యాప్తంగా 145 మందిపై ఈ తరహా దాడులు జరిగాయి. ఇప్పటివరకు ఈ నేరాలతో సంబంధమున్న 12 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులు గుచ్చిన సిరంజిలలో ఏముంది?, ఎందుకు గుచ్చారు? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ‘చిలిపి’ చేష్టగా ఖాళీ సిరంజిలతో ఆకతాయి బ్యాచ్లు దాడికి పాల్పడ్డాయా?, ఏదైనా ఉద్దేశంతో ఈ దాడులకు పాల్పడ్డారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కాగా, సూది పోట్లకు గురైన చాలామంది భయాందోళనతో ఆసుపత్రిలో చేరారు. అలాంటి వ్యక్తుల రక్తనమూనాలను వైద్యులు సేకరించారు. టాక్సికాలజికల్ టెస్టులు చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఏవైనా హానికర పదార్థాలు ఉన్నాయా లేవో స్పష్టత వస్తుంది. ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో ముగ్గురు వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బాధితులైన 145 మందిలో కొందరు టీనేజ్ బాలికలు కూడా ఉన్నారు.
Read this Article- India Vs England: ఇంగ్లండ్పై సెంచరీల మోత.. పంత్ సంచలన రికార్డ్
తొలి దాడి ఎక్కడంటే?
ఈశాన్య ఫ్రాన్స్లోని మెట్జ్లో ఉన్న ‘రూ డు పలైస్’ ‘స్ట్రీట్లో ఆదివారం రాత్రి 9.15 గంటల సమయంలో తొలి సిరంజి దాడి నమోదైందని పోలీసులు గుర్తించారు. ఈ దాడులతో సంబంధం ఉన్న ఓ అనుమానిత వ్యక్తికి సంబంధించిన సమాచారం అధికారులకు అందిందని మేయర్ ఫ్రాంకోయిస్ గ్రోస్డిడీ వెల్లడించారు. సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని గుర్తించామని ప్రకటించారు. నిందితుడి పేరు రూ సెర్పెనోయిస్లో నిర్ధారించామని , అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించామన్నారు. న్యాయ శాఖ దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లామని మేయర్ ఫ్రాంకోయిస్ వెల్లడించారు. నిందితుడి సెల్ఫోన్ను పరిశీలిస్తున్నామని, ఇతర దాడులకు సంబంధించిన సమాచారం ఏమైనా తెలుస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
కాగా, సిరంజి దాడుల్లో బాధితులను గుర్తించేందుకు స్థానిక అగ్నిమాపక శాఖ సేవలను వినియోగించారు. బాధితుల కోసం ఒక స్టేజింగ్ ఏరియాను ఏర్పాటు చేశారు. 7 అత్యవసర వాహనాలను సిద్ధం చేసి బాధితులను హాస్పిటల్స్కు తరలించారని ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం పేర్కొంది. పారిస్ నగరంలో ఈ తరహా 13 కేసులు నమోదవ్వగా, పోలీసులు దర్యాప్తులో చేస్తున్నారు. సిరంజి దాడులన్నీ సమన్వయంతో జరిగాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సిరంజిలతో దాడులు చేయడం వెనుక నిర్దిష్టిమైన ఉద్దేశాలు ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా సిరంజి దాడుల వ్యవహారం ప్యారిస్ నగర వాసులను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది.
Read this Article- Electric Aircraft: ఎలక్ట్రిక్ విమానం వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే..