Electric Aircraft: రవాణా వ్యవస్థలో దాదాపు అన్ని విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు పరుగులు పెడుతున్నాయి. కార్లు, బైకులు మొదలుకొని బస్సులు, ఆటోలు, చివరకు రైళ్లు కూడా విద్యుత్ శక్తితో నడుస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా విమానాలు కూడా చేరిపోయాయి.
బీటా టెక్నాలజీస్కు చెందిన ‘అలియా సీఎక్స్300’ అనే ఎలక్ట్రిక్ విమానం తొలిసారి విజయవంతంగా ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సంపూర్ణ ఎలక్ట్రిక్ విమానంగా ‘అలియా సీఎక్స్300’ చరిత్ర సృష్టించింది. ఒక ఎలక్ట్రిక్ విమానం ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చడం ఇదే తొలిసారి. ఈ నెల ప్రారంభంలో న్యూయార్క్ రాష్ట్రంలోని తూర్పు హాంప్టన్ నుంచి జాన్ ఎఫ్. కెన్నెడీ విమానాశ్రయానికి నలుగురు ప్రయాణికులతో ప్రయాణించింది. 35 నిమిషాల్లో 70 నాటికల్ మైళ్ల (130 కిలోమీటర్లు) దూరం ప్రయాణించింది.
70 నాటికల్ మైళ్ల ప్రయాణానికి ఖర్చు కేవలం రూ.694 (8 డాలర్లు) మాత్రమే అయ్యింది. ఇంధనంతో నడిచే ఒక హెలీకాప్టర్ ఇదే దూరం ప్రయాణించడానికి ఖర్చు రూ.13,885 (160 డాలర్లు) అవుతుందని అంచనా. ఎలక్ట్రిక్ విమానంలో మరో అదనపు ప్రయోజనం ఏంటంటే, ఇంజిన్లు, ప్రొపెల్లర్లు లేకపోవడం శబ్దం లేకుండానే ప్రయాణించింది. దీంతో, ప్యాసింజర్లు చక్కగా ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ ప్రయాణించారు.
Read this- By Polls 2025: ఉపఎన్నికల్లో మారిపోయిన ఆప్, బీజేపీ ముఖచిత్రాలు
‘అలియా సీఎక్స్300’ విమానం వంద శాతం ఎలక్ట్రిక్ విమానమని బీటా టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈవో కైల్ క్లార్క్ చెప్పారు. 70 నాటికల్ మైళ్ల దూరాన్ని కేవలం 35 నిమిషాల్లోనే చేరుకున్నామని తెలిపారు. ‘‘విమానానికి ఛార్జింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగరడానికి మాకు కేవలం 8 డాలర్లే ఖర్చవుతుంది. అయితే, పైలట్, విమానానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఏవిధంగా చూసుకున్నా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణమే’’ అని కైల్ క్లార్క్ వెల్లడించారు. విమానంలో ప్రయాణ సౌలభ్యం కారణంగా సీఎక్స్300 కచ్చితంగా విజయవంతమవుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
అనుమతుల కోసం ఎదురుచూపులు
ఎలక్ట్రిక్ విమానాలకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) సర్టిఫికేషన్ కోసం బీటా టెక్నాలజీస్ ఎదురుచూస్తోంది. గత ఆరేళ్లుగా సీఎక్స్300, అలియా ఈవీటీవోఎల్ రెండు మోడల్ విమానాల సాంప్రదాయ టేకాఫ్, ల్యాండింగ్పై కంపెనీ దృష్టిసారించింది. ఈ మేరకు రెండు మోడల్ విమానాలపైనా కృషి చేస్తోంది. ఈఏడాది చివరి నాటికల్లా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేషన్ను పొందాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. విమానాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదని, అందుకే, నగరాలు, శివారు ప్రాంతాల మధ్య తక్కువ దూర ప్రయాణాలకు ఈ విమానాలు అనువుగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. కాగా, వెర్మోంట్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీటా టెక్నాలజీస్ కంపెనీని 2017లో స్థాపించారు. ఎలక్ట్రిక్ విమానాల ఉత్పత్తి, సర్టిఫికేషన్, వాణిజ్యపరం చేయడమే లక్ష్యంగా 318 మిలియన్ డాలర్ల నిధులను కంపెనీ సమీకరించింది.
Read this- Arvind Dharmapuri: కేసీఆర్ ఫ్యామిలీని గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలి.. బీజేపీ ఎంపీ
కాగా, ఫ్లయింగ్ టాక్సీ విభాగంలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రయాణిస్తున్న ఇతర కంపెనీలు మరికొన్ని ఉన్నాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్ వేడుకలకు ఎయిర్ ట్యాక్సీలను అందించే అధికారిక సంస్థగా ‘ఆర్చర్ ఏవియేషన్’ పేరును గత నెలలో కమిటీ ప్రకటించింది. నగరంలో అథ్లెట్లకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవ్వకుండా ఈ ట్యాక్సీలు సౌకర్యవంతంగా ఉంటాయని ఒలింపిక్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. నిజానికి ఆర్చర్ ఏవియేషన్కు ఎఫ్ఏఏ అనుమతులు కూడా పొందింది. అయితే, 2026 నాటికి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలు పెట్టవచ్చనే అంచనాలు ఉన్నాయి.