Amit Shah: ‘ఆపరేషన్ కగార్’ పేరిట దేశంలో మావోయిస్టులను భద్రతా బలగాలు ఏరివేస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్సి సమూలంగా రూపుమాపుతామని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘ నా మాటలు గుర్తుపెట్టుకోండి. 2026 మార్చి 31 నాటికి మన దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సారధ్యంలో గత 11 ఏళ్లలో దేశంలో నక్సలిజం చాలా వరకు అణిగిపోయింది. మోదీ ప్రభుత్వంలో 11 ఏళ్లుగా దేశం సురక్షితంగా ఉంది. ఒకప్పుడు 11 రాష్ట్రాల్లో ప్రబలంగా ఉన్న నక్సలిజం ఇప్పుడు కేవలం 3 జిల్లాలకు మాత్రమే పరిమితం అయ్యింది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఆదివారం జరిగిన ‘కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్’ కార్యక్రమంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read this- Air India: కేరళలో బ్రిటన్ ఫైటర్ జెట్.. కదలని ఎయిరిండియా విమానం
ఆపరేషన్ కగార్లో భాగంగా ఛత్తీస్గఢ్, ఆ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇటీవలే నక్సల్స్కు చెందిన ముఖ్య నాయకులను కూడా బలగాలు మట్టుబెట్టాయి. మే 21న ఛత్తీస్గఢ్లోని బోటర్ గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏకంగా 27 మంది నక్సల్స్ హతమయ్యారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2014 నుంచి 2024 మధ్యకాలం గత పదేళ్లలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు ఏకంగా 53 శాతం మేర తగ్గాయి. 2004 -2014 మధ్య 16,463 నక్సల్స్ హింసాత్మక ఘటనలు నమోదవ్వగా, 2014 -2024 మధ్య ఈ సంఖ్య 7,744కి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. భద్రతా బలగాల ఆపరేషన్లు, వ్యూహాత్మక విధానాలకు ఈ గణాంకాలు ప్రతిబింభమని భద్రతా ఏజెన్సీల అధికారులు చెబుతున్నారు.
Read this- Andhra Pradesh: చంద్రబాబు పచ్చి అబద్దాలు.. సూపర్ సిక్స్పై నిస్సిగ్గుగా ప్రకటన!
రక్తాన్ని తాకి చూడండి
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై అమిత్ షా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఆపరేషన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్కు గట్టి సందేశం పంపించారని వ్యాఖ్యానించారు. ‘‘భారతదేశ రక్తం ఉన్నది చిందించడానికి కాదు. భారత రక్తాన్ని తాకి చూసే సాహసం చేస్తే శిక్ష తప్పదు’’ అని అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. 2014 కి ముందు యూపీఏ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులు జరుగుతుండేవి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ పాలనలో ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగేవి. అహ్మదాబాద్, జైపూర్, కోయంబత్తూర్, ఢిల్లీ నగరాల్లో కూడా దాడులు జరిగేవి. ప్రధాని మోదీ పాలనలో భారత్పై పాకిస్థాన్ మూడుసార్లు దాడికి ప్రయత్నించింది. ఉరీలో (Uri Attack) దాడికి ప్రయత్నించినప్పుడు ‘సర్జికల్ స్ట్రైక్’తో కొట్టాం. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా వైమానిక దాడులు చేశాం. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయాలను నేలమట్టం చేశాం’’ అని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ నెలలో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మే 7న కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుపెట్టింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది.