Shanaishwaraswamy Jayanti: సంగారెడ్డి జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతున్న జహీరాబాద్ బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనైశ్వరస్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనైశ్వరస్వామి జయంతిని పురస్కరించుకొని ఆశ్రమ ఆవరణలోని శనిఘాట్ను రంగురంగుల పువ్వులతో సుందరంగా అలంకరించారు.ఉదయం 5 గంటలకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకార్చనలు చేశారు.
వేద మంత్రాల మధ్య 1008 కలశాలతో తిలతైలా ఘటాభిషేకం వైభవంగా కొనసాగింది. యజ్ఞశాల ప్రవేశం చేసి యజ్ఞాన్ని ప్రారంభించి పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం జ్యేష్ఠాదేవి సమేత శనైశ్వర స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
Also Read: Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!
వేడుకలకు హజరైన ప్రభుత్వ సలహాదారులు కేకే, జడ్జి కవిత,ఎంఎల్ఎ సంజీవరెడ్డి
ఆశ్రమంలో జరిగిన శనైశ్వర స్వామి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితదేవి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, వై.నరోత్తంలు వేరువేరుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని తైలాభిషేకం, మహా మంగళహారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సన్మానించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ పాటిల్, కోట శ్రీనివాస్, బి.కృష్ణ, బోయిని ఎల్లన్న, నాగన్న పాటిల్ పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.
Aslo Read: Fake IAS officer: వామ్మో ఎంత మోసం.. నకిలీ మహిళా ఐఏఎస్ డాక్టర్ గుట్టురట్టు!