National Herald Case: జాతీయ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో.. వారు రూ.142 కోట్లు లబ్ది పొందారని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు (Delhi Court)లో జరిగిన విచారణలో ఈడీ తన వాదన వినిపించింది.
నేషనల్ హెరాల్డ్ (National Herald case) పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ (Money Laundering) ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఢిల్లీ కోర్డ్ లో విచారణ జరిగింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సోనియా, రాహుల్ గాంధీలపై సంచలన ఆరోపణలు చేశారు. 2023 నవంబర్ లో నేషనల్ హెరాల్డ్ కు చెందిన రూ. 751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని ఆయన కోర్టు ఎదుట ప్రస్తావించారు. అయితే జప్తుకు ముందు వరకూ ఆ ఆస్తులపై వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ లబ్దిగా పొందారని వ్యాఖ్యానించారు. దాని విలువ రూ.142 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.
నేరం ద్వారా వచ్చిన ఆస్తులను తమ వద్ద అట్టిపెట్టుకోవడమే కాకుండా.. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైతం గడించారని ఢిల్లీ కోర్టుకు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు తెలిపారు. ఆ డబ్బుతో అక్రమ లావాదేవీలకు సైతం పాల్పడ్డారని కోర్టుకు విన్నవించారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గాంధీలతో పాటు సామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులపై జరిపిన ప్రాథమిక విచారణలో ఈ విషయాలు రుజువు అయ్యాయని ఈడీ తరపున కోర్టుకు స్పష్టం చేశారు.
Also Read: Chattisgarh Encounter: నక్సల్స్కు భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేత సహా 30 మంది మృతి!
2014 జూన్ 26న బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రైవేట్ ఫిర్యాదుతో నేషనల్ హెరాల్డ్ కేసు తెరపైకి వచ్చింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 2న రాహుల్, సోనియా గాంధీలకు ఢిల్లీ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఛార్జిషీట్ విచారణ సమయంలో వారి వాదనలు వినిపించే హక్కు ఉందని ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే తెలిపారు.