Cyber Criminals Fraud: సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డ ఓ ప్రైవేట్ ఉద్యోగి 47లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కాగా, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు ఇవ్వటంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు 40లక్షల రూపాయలను రికవరీ చేశారు. కోర్టు అనుమతితో ఆ మొత్తాన్ని బాధితునికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో నివాసముంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగికి శుక్రవారం అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. కాల్ చేయటానికి ముందే సదరు వ్యక్తి తన సహచరున్ని కాన్ఫరెన్స్ లో పెట్టాడు. ఈ విషయం బాధితునికి తెలియదు.
ఇక, బాధితునితో మాట్లాడిన సైబర్ క్రిమినల్ మీ బ్యాంక్ ఖాతాలను అప్ డేట్ చేయాల్సి ఉందని చెప్పాడు. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ చెప్పండన్నాడు. మోసగాడు చెప్పినట్టుగానే బాధితుని ఫోన్ కు వాయిస్ ఓవర్ ద్వారా ఓటీపీ నెంబర్ వచ్చింది. కాన్ఫరెన్స్ కాల్ లో ఆ నెంబర్ విన్న సైబర్ క్రిమినల్ సహచరుడు వెంటనే బాధితుని బ్యాంక్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. అందులో ఉన్న 47లక్షల రూపాయలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.
Also Read: Saree @ Rs 9: వ్యాపారి కొంప ముంచిన ప్రకటన.. పోటెత్తిన మహిళలు.. ఇక అంతా రచ్చ రచ్చ!
అకౌంట్ నుంచి 47లక్షలు ట్రాన్స్ ఫర్ అయినట్టు వచ్చిన మెసెజ్ చూసిన బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ కే.మధుసూదన్ రావు సంబంధిత బ్యాంక్ నోడల్ అధికారితో మాట్లాడారు. అప్పటికే సైబర్ మోసగాళ్లు 7లక్షల రూపాయలను తమ ఖాతాలోకి ట్న్స్ ఫర్ చేసుకున్నారు. కాగా, సీఐ మధుసూదన్ రావు మిగితా 40లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించారు.
నాంపల్లిలోని 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ అనుమతితో ఆ డబ్బును బాధితునికి తిరిగి అప్పగించారు. వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి 40లక్షల రూపాయలు బాధితునికి తిరిగి చేర్చిన సీఐ మధుసూదన్ రావు, అనూషతోపాటు సిబ్బందిని కమిషనర్ సీ.వీ.ఆనంద్ అభినందించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు