Fake Maehendi: రంజాన్ పండుగ సమీపిస్తోంది.. దీంతో నగరంలో ఒక ప్రత్యేకమైన శోభ కనిపిస్తోంది. ఈ పవిత్రమైన సందర్భంలో చిన్నా పెద్దా, మహిళలు, పురుషులు అందరూ ఉత్సాహంగా మెహందీని పెట్టుకుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ సంప్రదాయాన్ని మరింత ఆనందంగా జరుపుకుంటారు. వారి చేతులను అందమైన మెహందీ డిజైన్లతో అలంకరించుకుంటారు. ఈ సందర్భాన్ని అదునుగా తీసుకుని, మార్కెట్లో వివిధ రకాల మెహందీ బ్రాండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో కొన్ని నకిలీ బ్రాండ్లు ఉంటున్నాయి. నిన్న టపాచబుత్ర పోలీసులు జరిపిన దాడిలో ఈ విషయం బయటపడింది.
రంజాన్ సమయంలో మెహందీకి డిమాండ్ గణనీయంగా పెరగడంతో, కొత్త కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను పరిచయం చేస్తూ, వినియోగదారుల ఆకర్షణ కోసం పోటీపడుతున్నాయి. సహజసిద్ధమైన మెహందీ నుండి రసాయనాలతో కూడిన రంగురంగుల ఉత్పత్తుల వరకు, మార్కెట్లో ఇవి కుప్పలుతెప్పలుగా లభిస్తున్నాయి. అందమైన డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులతో ఈ మెహందీ ఉత్పత్తులు చూస్తే ఎవరికైనా పెట్టుకోవాలనిపిస్తుంది. అయితే మీరూ మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
Also Read: పసికందు చేసిన పాపమేమి? బిడ్డను బకెట్ లో ముంచి మరీ చంపిన తల్లి
ఎందుకంటే గతంలో ఇలా మెహందీ పెట్టుకోవడం ద్వారా ఓ మహిళ చేతులకు గాయాలు అయిన సంఘటన తెలిసే ఉంటుంది. అప్పట్లో ఆ మహిళ చేతులకు గాయాలు కలిగించినటువంటి ఆ నకిలీ మెహందీ మళ్లీ మార్కెట్లోకి వచ్చేసింది. హైదరాబాద్లోని టప్పాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నకిలీ మెహందీ తయారీ కేంద్రం గుర్తించబడింది. నిన్న రాత్రి (మార్చి 27వ తేదీ) సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, టప్పాచబుత్ర పోలీసులు సంయుక్తంగా ఓ ఇంటిపై దాడి చేసి, ఈ నకిలీ మెహందీ తయారీని పట్టుకున్నారు.
ఈ ఘటనలో యాసీన్, మోసిన్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు నటరాజ్ నగర్లో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ కరాచీ మెహందీ తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. ఈ కేంద్రంలో రసాయనాలు కలిపి మెహందీని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ మెహందీ వాడకం వల్ల చేతులు, కాళ్లు, చర్మం కాలిపోయే ప్రమాదం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దాడిలో భాగంగా పోలీసులు సుమారు 70 కార్టూన్ల మెహందీని స్వాధీనం చేసుకున్నారు. ఈ మెహందీ విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
Also Read: పెద్దపల్లి జిల్లాలో సంచలనం.. మరో ప్రేమికుడి దారుణ హత్య
రంజాన్ పండుగ సమీపిస్తున్న ఈ సమయంలో, మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకొని, ఈ నకిలీ మెహందీని విక్రయించేందుకు నిందితులు సన్నాహాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంజాన్ సందర్భంగా మెహందీ పెట్టుకోవడం ముస్లిం సంప్రదాయంలో ఒక భాగం కావడంతో, ఈ నకిలీ ఉత్పత్తులను భారీ ఎత్తున అమ్మాలని వీరు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులు ముందుగానే గుర్తించి ఈ ప్రమాదకర ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులైన యాసీన్, మోసిన్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ నకిలీ మెహందీ తయారీలో మరెవరైనా భాగస్వాములున్నారా, ఈ ఉత్పత్తులు ఇంతకు ముందు ఎక్కడెక్కడ విక్రయించారు అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.