రంగారెడ్డి బ్యూరో స్వేచ్చః Rangareddy district: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల పరంపర కొనసాగుతోంది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో రకాల పరిశ్రమలు ఆయా జిల్లాల్లో ఏర్పాటవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాల్లోనే పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు ఉపాధి పొందుతున్నారు. టీజీ ఐపాస్ ద్వారా సులభతరంగా అనుమతులు లభిస్తుండడంతో అనుమతుల కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తు చేస్తున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్క ఏడాదిలోనే రూ.6,035కోట్ల పెట్టుబడులతో 448 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే నలు చెరుగులా పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రభతో వెలిగిపోతోంది. భవిష్యత్తులోనూ ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కంపెనీలు రానున్నాయి.
సులభతర అనుమతులు:
పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసే సరిపోతుంది. టిజి ఐపాస్ లో అనుమతులు సులభతరమయ్యాయి. అన్నీ సజావుగా ఉంటే 15 రోజుల్లోనే అనుమతులొచ్చేస్తున్నాయి. రవాణా సదుపాయాలు మెరుగుపడడం శాంతిభద్రతల సమస్యలు లేకపోవడంతో పారిశ్రామిక వేత్తలు గ్రామీణ జిల్లాల వైపు సైతం మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక కళ ఉట్టిపడుతోంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఉమ్మడి జిల్లా ఆకర్షణీయ గమ్యస్థానమైంది.
ప్రస్తుతం 2.38లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు తక్కువ సంఖ్యలో ఏర్పాటయ్యాయి. అప్పట్లో కల్పించబడ్డ ఉద్యోగ, ఉపాధి కూడా అంతంత మాత్రమే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరావడంతో ప్రస్తుతం రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 39 వేల 825 కోట్ల పెట్టుబడులతో 7,512 పరిశ్రమల ఏర్పాటు ద్వారా 2,38,444 మందికి ఉపాధి కల్పించబడుతోంది. రంగారెడ్డి జిల్లాలో ప్రముఖ సంస్థలైన ఫాక్స్కాన్, గూగుల్, బోయింగ్, విప్రో, ప్రిమియర్ ఎనర్జీస్, రేడియంట్, ఓరియంట్, వంటి పరిశ్రమలు ఏర్పాటై వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
మారుమూల ప్రాంతమైన చందనవెల్లిలోని నేడు పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులో ఏడేండ్లలోనే రూ.13,508కోట్ల పెట్టుబడులతో 40 పరిశ్రమలు ఏర్పాటై 3,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. వెల్స్పన్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఓలెక్టా గ్రీన్టెక్, దైఫుకు, నికోమాక్ తైకిషా, కిటెక్స్ వంటి మెగా ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోనే కొలువుదీరాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండగల్ వద్ద రూ.650కోట్ల పెట్టుబడితో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయగా ఉత్పత్తులు కొనసాగుతున్నాయి.
బీఆర్ఎస్ విమర్శలకు చెక్:
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలిరాగా చాలా వరకు పరిశ్రమలు రంగారెడ్డి జిల్లాలోనే ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లల్లోనే ఆరోపించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో పరిశ్రమల పరంపర కొనసాగుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు చెక్ పడింది.
దావోస్, సింగపూర్ పర్యటనల్లో అనేక కంపెనీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకోవడం ముఖ్యంగా ఎస్టీ టెలీమీడియా సంస్థ ముచ్చర్లలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.3,500కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోవడం వంటి ఉదంతాలను పారిశ్రామిక రంగ నిపుణులు ఉదాహరణగా చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన భరోసాతోనే ఫాక్స్కాన్ కంపెనీ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉంది.
తైవాన్కు చెందిన ఎలీజియన్స్గ్రూప్ ఫ్యూచర్ సిటీలో రూ.2వేల కోట్ల భారీ పెట్టుబడితో మొట్టమొదటి ప్రపంచ స్థాయి సాంకేతిక పారిశ్రామిక పార్క్(ఐటీఐపీ)ను ఏర్పాటు చేసేందుకు ఇటీవలనే సంసిద్దత వ్యక్తం చేసింది. ఈ పార్క్లో ఎలక్టానిక్స్, సోలార్ పరికరాలను ఉత్పత్తి చేయనున్నారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లనుండడంతో మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: CM Revanth on Betting Apps: బెట్టింగ్ యాప్స్ ఆగడాలపై సీఎం రేవంత్ కన్నెర్ర.. అసెంబ్లీలో కీలక ప్రకటన