Huzurabad News: హుజురాబాద్ తహసిల్దార్ కోడెం కనకయ్య(MRO Kodem Kanakaiah) ఏడాదిన్నర తిరగకముందే అకస్మాత్తుగా బదిలీ కావడం స్థానిక రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వివాదరహితునిగా, సమర్థ అధికారిగా పేరున్న ఆయన బదిలీ వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే ప్రధాన కారణమని బలంగా ప్రచారం జరుగుతోంది. జిల్లా కలెక్టర్ నుండి గురువారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.
అధికార పార్టీ నుండి ఒత్తిడి
ఈ బదిలీకి ప్రధానంగా రెండు అంశాలు కీలకంగా మారినట్లు సమాచారం. మొదటిది, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(MLA Padi Kaushik Reddy) క్యాంపు కార్యాలయంలో జరిగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం. దీనిని నిలిపివేయాలని అధికార పార్టీ నుండి ఒత్తిడి వచ్చినా, లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఆ కార్యక్రమాన్ని కొనసాగించారు. తాము వద్దని చెప్పినా చెక్కులు ఎలా ఇచ్చారని అధికార పార్టీలోని ఒక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండవది, హుజురాబాద్లోని బుడగజంగాల కాలనీలో అసైన్డ్ భూమిని కొందరు నాయకులు అక్రమంగా ప్లాట్లుగా మార్చడాన్ని ఎమ్మార్వో(MRO) నిబంధనల ప్రకారం అడ్డుకోవడం లేదా ఒక వర్గానికి సహకరించకపోవడం. ఈ అసైన్డ్ భూమి వ్యవహారంలో ఉన్న స్థానిక నాయకుడు ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read: Bigg Boss Telugu 9: బాండింగ్స్పై భరణి డాటర్ స్పందనిదే.. రీతూని కొట్టబోయిన ఆమె మదర్!
నాయకుల ఆధిపత్య పోరు
ఒకే పార్టీకి చెందిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు, పనుల విషయంలో పెరిగిన ఒత్తిడి కారణంగానే కనకయ్య బదిలీ వేటుకు గురైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు, ఒక మంత్రి ఆదేశాల మేరకే బదిలీ జరిగిందని స్థానిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మార్వో ఆకస్మిక బదిలీతో క్షేత్ర స్థాయిలో పాలన ప్రజలకు దూరమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తహసిల్దార్ తర్వాత తదుపరి బదిలీ ఆర్డీ(RDO)వో దా అనే చర్చ రెవెన్యూ వర్గాలలో మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
