Bhadradri Kothagudem: దమ్మపేట మండల కేంద్రంలో అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి, ఆవేదనకు దారితీస్తోంది. ప్రజల సౌకర్యం కోసం ప్రారంభించిన ఈ పనులు, నాణ్యతా లోపం మరియు పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు మారుపేరుగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్ స్థంభాల చుట్టూ చిప్స్, కంకర, నిర్మాణ సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వదిలేయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ లేని ప్రాంతాల్లో ఈ ఇలా ఉండడం కారణంగా చిన్నపాటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bhadradri Kothagudem: గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది
ఇటీవల సెంట్రల్ లైటింగ్ స్థంభాల్లో ఒకటి బిగింపు సరిగా లేక కూలిపోవడం స్థానికుల భయాందోళనకు కారణమైంది. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. “ఇలాంటి నిర్లక్ష్య పనులు మరోసారి జరిగితే ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది” అని గ్రామస్థుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. స్థంభాలు కూలిపోవడం, విద్యుత్ కనెక్షన్లను అస్తవ్యస్తంగా వదిలేయడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం కలిపి ఈ ప్రాజెక్ట్పై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
అధికారుల పర్యవేక్షణ లోపాన్ని బహిర్గతం
నాణ్యతలేని సెంట్రల్ లైటింగ్ పనులు స్థానికులు చెబుతున్నదేమిటంటే, “అభివృద్ధి పనులు అని చెప్పుకుంటూ నాణ్యతను విస్మరిస్తే అది ప్రజల ప్రాణాలతో ఆటపట్టడమే. ప్రాజెక్టు మొదలైన కొన్ని వారాలకే పలు లోపాలు బయటపడటం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని బహిర్గతం చేస్తోందని ప్రజలు అంటున్నారు. యాజమాన్యం మాటల్లో మాత్రమే కాకుండా పనుల్లోనూ సమర్థత చూపాలని వారు డిమాండ్ చేశారు. స్థానికులు ఈ లైటింగ్ ప్రాజెక్ట్పై పూర్తి స్థాయి విచారణ జరిపి, కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాధనం వృథా కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్య పనులు జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
Also Read: Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. ఆదివాసి అడవి బిడ్డలకు తీరని తిప్పలు
