గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో వ్యవసాయ కార్మికులు(Agricultural workers) వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, వారికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంసిపిఐ మండల కార్యదర్శి మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం ఎంసిపిఐ(CPIM) పార్టీ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘంలో 50 కుటుంబాల వారు ఎంసిపిఐ మండల కార్యదర్శి మరిపెళ్లి మొగిలి, జిల్లా నాయకుడు జాటోత్ బిచ్యానాయక్ సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలు తీవ్రమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కూలీలకు కనీస వేతనం
రైతులకు రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదని, యూరియా(Urea) అందడం లేదని, దాని ప్రభావం నేరుగా వ్యవసాయ కార్మికుల జీవనంపై పడుతోందని పేర్కొన్నారు. కూలీలకు కనీస వేతనం అందకపోవడం, సీజనల్ పనుల్లో మాత్రమే ఉపాధి లభించడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణం కూలీలకు కనీస వేతనం ఖరారు చేసి, దానిని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా సామాజిక భద్రతా పథకాలు, వైద్య సదుపాయాలు, వృద్ధాప్య పెన్షన్లు అందేలా చూడాలని కోరారు. కూలీల పిల్లలకు ఉచిత విద్య, వృత్తి శిక్షణ కల్పిస్తేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు.
Also Read: Teachers Protest: మా సమస్య ప్రభుత్వానికి చెప్పు.. పట్టించుకునేలా చెయ్.. గణపయ్యకు వినతి పత్రం
ఆరోగ్య బీమా సదుపాయాలు
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని(Employment Guarantee Scheme) విస్తృతంగా అమలు చేసి, ఏడాది పొడవునా కనీసం 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ డబ్బులు వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, గృహ స్థలం, ఇళ్లు, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలని కూడా కోరారు. ఇనుగుర్తిలో 304 సర్వే నెంబర్ లోని సుమారు 30 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎల్లమ్మ, సత్తు సోమయ్య, కారంపొడి ముత్తయ్య, జక్కు యశోద, కసరబోయిన ఎల్లమ్మ, కసరబోయిన యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Police Officers: పోలీస్ అధికారులకు ప్రతిభ పురష్కారాలు