Farmers Protest: జిల్లాలో రైతాంగం యూరియా కోసం పడిగాపులు కాస్తోంది. ఎరువుల దుకాణాల వద్ద రాత్రింబగళ్లు క్యూ కడుతున్నారు. అయితే యూరియా(Urea) సరఫరా తక్కువగా రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున తొర్రూరు పీఎసీఎస్(PSS) రైతుసేవా కేంద్రం ఎదుట పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. నిర్వాహకులు స్టాక్ లేదని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. చివరికి పోలీసులు సముదాయించడంతో రైతులు ధర్నా విరమించారు.
లోడు రాక… గోడు తీరక…
మండలానికి కావాల్సిన యూరియా రాకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు జోరుగా పడుతున్నా ఎరువు దొరకక సాగు పనులు వాయిదా పడుతున్నాయి. గత పదిహేను రోజులుగా యూరియా దొరుకుతుందనే నమ్మకంతో పీఎసీఎస్ వద్ద రోజూ క్యూ కడుతున్నా రైతుల గోడు తీరడం లేదు. బీఆర్ఎస్(BRS) హయాంలో యూరియా కొరతే లేదు. కాంగ్రెస్ పాలనలో మాత్రం యూరియా కోసం నడిరోడ్డుపై బైఠాయించాల్సి వస్తోంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరి నాట్లు వేసి నెల రోజులు గడిచిపోయింది. పత్తి, మక్క, తదితర పంటలకు యూరియా వేసే సమయం ఆసన్నమైంది. అయినా సరఫరా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు మూడు రోజుల్లో వస్తుందని చెబుతున్నారు. కానీ ఎప్పటిలాగే మాటలు మాత్రమే మిగులుతున్నాయి. ఉదయం నుంచి రాత్రివరకు పేగులు మాడ్చుకొని కాపలా కాస్తున్నా యూరియా మాత్రం అందడం లేదు అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Kothagudem: ఆపరేషన్ చేయూత.. 8 మంది మావోయిస్టుల లొంగుబాటు!
అధికారులు స్పందించాలి
ఒక్కో రైతు ఒక బస్తా కోసం రెండు వారాలుగా తిరుగుతున్నా యూరియా దొరకట్లేదు. తెల్లవారుజామున 5 గంటలకే బారులు తీరినా, కొద్ది మందికే ఇస్తున్నారు. మిగిలిన వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు, అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే యూరియా కొరత తీర్చి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: KTR: యూరియా కోసం రైతుల తండ్లాట.. ఎంపీలపై కేటీఆర్ ఫైర్