Karimnagar: కరీంనగర్ ఔషధ నియంత్రణ మండలి (డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ – DCA) నిబంధనలను ఉల్లంఘిస్తూ మెడికల్ షాపుల కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లు (అర్హత కలిగిన మందుల నిపుణులు) అందుబాటులో లేకుండానే అనేక దుకాణాల్లో మందుల విక్రయాలు కొనసాగుతుండటంపై సామాజిక కార్యకర్తలు, వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ విక్రయాలు ప్రజారోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. అర్హత, అవగాహన లేకుండా ఇచ్చే మందులు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Karimnagar: బ్యాచ్మేట్ స్నేహం కోసం.. గ్రామానికి వచ్చిన పోలీస్ కమిషనర్
నిబంధనల ఉల్లంఘనల అద్దె ధృవపత్రాల పర్వం!
ఔషధ నియాత్రణ మండలి నిబంధనల ప్రకారం, ప్రతి మెడికల్ షాపులో తప్పనిసరిగా అర్హత కలిగిన ఫార్మసిస్ట్ ఉండాలి. మందుల గురించి సరైన సమాచారం ఇవ్వడం, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం, మోతాదును వివరించడం వంటి కీలక బాధ్యతలను ఫార్మసిస్ట్ మాత్రమే నిర్వహించాలి. అయితే కరీంనగర్ జిల్లాలోని అనేక మెడికల్ షాపులు, హుజురాబాద్లోని కొందరు మెడికల్ షాపుల్లో కేవలం లైసెన్స్ పొందడం కోసం ఫార్మసిస్ట్ల ధృవపత్రాలను ‘అద్దెకు’ తీసుకుంటున్నారని, వారికి నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ, ఎలాంటి అర్హత లేని వ్యక్తులతో షాపులు నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఫలితంగా అనేక అనర్థాలు
రోగులకు సరైన మందులు ఇవ్వడంలో, మోతాదు విషయంలో తీవ్ర పొరపాట్లు జరుగుతున్నాయి. నాణ్యత ప్రశ్నార్థకం: గడువు (ఎక్స్పైరీ డేట్) ముగిసిన మందులను విక్రయించడం, నకిలీ మందులను నిల్వ ఉంచడం వంటి అక్రమాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదకర విక్రయాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా యాంటీబయాటిక్స్, అధిక మోతాదులో వాడితే మత్తు కలిగించే నొప్పి నివారణ మందులు (నార్కోటిక్ మందులు), గర్భవిచ్ఛిత్తి కోసం వాడే అబార్షన్ టాబ్లెట్స్ను విచక్షణారహితంగా విక్రయిస్తున్నారు. ఇది సమాజంలో నేరాలకు, అనారోగ్యకర అలవాట్లకు, ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగానికి దారితీసే పెనుముప్పుగా మారుతోంది.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రశ్నల వర్షం
నిబంధనలను ఉల్లంఘిస్తున్న మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా జరుగుతున్నప్పటికీ, అధికారులు కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్లక్ష్యం ఆరోపణలు: అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిబంధనలు పాటించని దుకాణాల సంఖ్య పెరిగి, ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముడుపులు అందితే చాలా? నియంత్రణ వద్దా?
ఇప్పటివరకు డ్రగ్ కంట్రోల్ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవని, ముడుపులు అందడం వల్లే అధికారులు అక్రమాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలను కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేసి, అనేక కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో కూడా ఫార్మసిస్ట్ లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు వంటి ఉల్లంఘనలను గుర్తించినప్పటికీ, జిల్లా సహా హుజురాబాద్లో మాత్రం స్థానిక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.
Also Read: Illegal Lottery Tickets Sale: సీఎం సొంత జిల్లాల్లో అక్రమ లాటరీ దందా.. కుదేలవుతున్న బాధితులు
తక్షణ చర్యలకు డిమాండ్
ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారులు తక్షణమే స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
సీజ్, కేసులు నమోదు
ఫార్మసిస్ట్లు లేకుండా నడుస్తున్న మెడికల్ షాపులను వెంటనే సీజ్ చేయాలని, నకిలీ, గడువు ముగిసిన మందులను విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నార్కోటిక్ కట్టడిఅనధికార మత్తుమందులు, ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలను కట్టడి చేయడానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిసి సమగ్ర దాడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అధికారుల పర్యవేక్షణ: ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ కీలక విషయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు పారదర్శకంగా వ్యవహరించి, నిర్లక్ష్యం వహించే వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!
