Bhadrachalam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం (Bhadrachalam)లో అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ, అధికారులు కాసుల కక్కుర్తికి లోబడి ఇష్టానుసారంగా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ కట్టడాల కారణంగా స్థానికుల ప్రాణాలకు రక్షణ కరువవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Bhadrachalam: ఇళ్ల స్థలానికి గజానికి రూ.20 వేలు చెల్లించాలి.. ఆ ప్రజలు డిప్యూటీ కలెక్టర్ కు వినతి!
నిబంధనలు అపహాస్యం
సాధారణంగా గ్రామ పంచాయతీ అయిన భద్రాచలంలో జీ-ప్లస్ వన్ నిర్మించుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఏజెన్సీ ముఖద్వారమైన భద్రాచలంలో ఎటు చూసినా పేకమేడల్లాగా బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఏజెన్సీ చట్టాలను పరిరక్షించాల్సిన ఐఏఎస్ అధికారులు (ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్) ఇద్దరు ఉన్నప్పటికీ, వారు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తుంది. బహుళ అంతస్తుల నిర్మాణాలకు ప్రత్యేక అనుమతుల పేరుతో అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, నిబంధనలను పక్కన పెట్టి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా మారిందని ఆరోపణలు ఉన్నాయి.
ప్రాణనష్టం నుంచి పాఠం నేర్వలేదు
ఈ ఏడాది మార్చి నెలలో రామాలయానికి అతి సమీపంలో నాలుగు అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలి, ఆ శిథిలాల కింద ఇద్దరు కూలీలు మృత్యువాత పడిన భయానక సంఘటన అందరికీ తెలిసిందే. ఆ దుర్ఘటన తర్వాత కూడా అధికారులు నేర్చుకున్న నీతి ఏంటో అర్థం కావడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రామ పంచాయతీ, ఎంఆర్ఓ ఆఫీసు పక్కన, గోదావరి ఒడ్డు సమీపంలో కూడా కొన్ని బహుళ అంతస్తులకు అనుమతి ఏ విధంగా ఇచ్చారో, అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
భూకంప జోన్లో భారీ నిర్మాణాలు
భద్రాచలం భూకంప జోన్లో ఉన్నట్లు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. గడిచిన పదేళ్లలో భద్రాచలం కేంద్రంగా భూమి కంపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. బహుళ అంతస్తులు నిర్మించే ప్రాంతాల చుట్టూ అనేక మంది నివాసం ఉంటున్నారు. భూకంపాలు సంభవిస్తే ఈ బహుళ అంతస్తులు కుప్పకూలి సమీప ఇళ్లపై పడటం ద్వారా భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొనసాగుతున్న బహుళ అంతస్తులు భూకంప తీవ్రతను తట్టుకోగలిగేలా నిర్మిస్తున్నారా లేదా అనే అంశాన్ని అధికారులు ఆరా తీయకపోవడం ఆందోళన కలిగిస్తుంది.
ఏజెన్సీ చట్టాలకు తూట్లు
ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ భద్రాచలం కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, కాసులకు కక్కుర్తి పడి ఇష్టానుసారంగా అనుమతులు మంజూరు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వారిపై ఓ కన్నెయాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
