Huzurabad Civil Hospital: హుజూరాబాద్ సివిల్ ఆసుపత్రిలో (Huzurabad Civil Hospital) పనిచేస్తున్న కార్మికులు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు సమ్మెకు దిగారు. కార్మికుల పోరాటం తర్వాత, ఆసుపత్రి సూపరింటెండెంట్, కాంట్రాక్టర్ స్పందించి వారికి హామీ ఇచ్చారు. బ్యాంకు సెలవులు ఉన్నందున ఉదయం 11 గంటల కల్లా మూడు నెలల జీతాలు చెల్లిస్తామని, దసరా నాటికి మిగిలిన మూడు నెలల జీతాలు కూడా ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ఒకవేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే, మళ్ళీ నిరవధిక సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు.
కాంట్రాక్టర్ని అడిగినా ఫలితం లేదు
ఈ సందర్భంగా, సిఐటియు (CITU) జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, ప్రజలకు సేవలు అందించే ఫ్రంట్లైన్ వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని అన్నారు. సరైన సమయంలో జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యను పరిష్కరించమని సూపరింటెండెంట్ మరియు కాంట్రాక్టర్ని అడిగినా ఫలితం లేదని ఆయన తెలిపారు. అయితే, సిఐటియు ఆధ్వర్యంలో గతంలో ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామని, ఈసారి కూడా కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన అన్నారు. ఇచ్చిన హామీపై నమ్మకం ఉంచామని, కానీ మాట తప్పితే మాత్రం భవిష్యత్తులో నిరవధిక సమ్మె తప్పదని రమేష్ స్పష్టం చేశారు. ఈ నిరసనలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్, యూనియన్ నాయకులు రాజయ్య, స్వరూప, రాధ, అనిత, తిరుపతి, మరియు సుమారు 25 మంది సభ్యులు పాల్గొన్నారు.
Also Read: Uttam Kumar Reddy: మహిళలలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి.. మంత్రి కీలక వ్యాఖ్యలు